కంటోన్మెంట్, జూన్ 3 : దేశానికి వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం బోయిన్పల్లి మార్కెట్ యార్డులో రైతు దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా చేశారని గుర్తు చేశారు. రైతులు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు.
ప్రధానంగా వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా, నూతన ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ.12 వేల కోట్లను భరిస్తుందని, పంట పెట్టుబడి సాయం కోసం రూ. 15 వేల కోట్లను వెచ్చిస్తుందని అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి పీడీయాక్ట్ను తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు కోటి 31 లక్షల ఎకరాల భూమి సాగులో ఉండగా, నేడు 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.
అదేవిధంగా నాడు 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండగా, నేడు 2.70 కోట్ల టన్నులకు పెరిగిందని వివరించారు. అనంతరం పలువురు రైతులు, హమాలీలను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక ఆనంద్ గౌడ్, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, మార్కెటింగ్ జేడీ ఇప్తెకార్, మార్కెట్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్రెడ్డి, మార్కెట్ పాలకమండలి సభ్యులు మాడిశెట్టి గిరిధర్, దేవులపల్లి శ్రీనివాస్, నయీమ్, మార్కెట్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు తలసాని శంకర్ యాదవ్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వం
రాష్ట్రంలో వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా చేశారు. రైతులకు పెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం మరెక్కడా లేదు. రైతుల భూములకు భద్రత కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. రైతును రాజును చేయడానికి సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో రైతాంగం కేసీఆర్కు అండగా నిలవాలి.
– మర్రి రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి,మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ