మేడ్చల్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి నాలు దిక్కుల ఐటీ పార్క్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్వే ఐటీ పార్క్ జిల్లాకు తలమానికంగా మారనుంది. ఐటీ పార్క్ పనులు పూర్తయితే జిల్లా మరింత అభివృద్ధి చెందనుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్లే మేడ్చల్లో ఐటీ పార్క్ ఏర్పాటు సాధ్యమవుతున్నదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ పార్క్ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం.. పనులు ప్రారంభించేలా సంబంధిత కాంట్రాక్టర్లకు పనులను అప్పగించిన విషయం తెలిసిందే. 10 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో.. రూ.998 కోట్ల వ్యయం.. 22 లక్షల ఎస్ఎఫ్టీతో గేట్వే ఐటీ పార్క్ను నిర్మించేలా ప్రణాళికను రూపొందించారు. ఐటీ పార్క్ ఏర్పాటుతో జిల్లా రూపురేఖలు మారి.. మరింత అభివృద్ధి సాధించనుంది.
గేట్వే ఐటీ పార్క్లో ఇప్పటికే కంపెనీల రిజిస్టేషన్..
గేట్వే ఐటీ పార్క్లో కంపెనీలు స్థాపించేందుకు ఇప్పటికే దేశ, విదేశాల కంపెనీలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయి. సుమారు 150 పైచిలుకు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఐటీ కంపెనీల ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఇక్కడ 150 ఐటీ కంపెనీలు ఏర్పడితే కండ్లకోయ ప్రాంతమంతా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. వ్యాపారాలు మరింత అభివృద్ధి చెంది.. వేలాది మంది ఉపాధి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఐటీ పార్క్ పూర్తయితే జిల్లాకు మరింత శోభ రానుంది.