శంషాబాద్ రూరల్, మే 6 : కడ్తాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గతనెల 29వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు. సోమవారం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామానికి చెందిన రవీందర్(45), గీత దంపతులు. రవీందర్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా.. గీత మీర్పేట పరిధిలోని విశాల్ మార్ట్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నది. అప్పటికే ఆమె బాలాపూర్కు చెందిన డ్రైవర్ కడారి యాదగిరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని గీత, యాదగిరి కలిసి పథకం వేశారు. ఏప్రిల్ 29న రాత్రి విశాల్ మార్ట్ వద్దకు వచ్చిన భర్తను చూసిన ఆమె, ప్రియుడికి సమాచారమిచ్చింది. దీంతో యాదగిరి తన స్నేహితుడైన అనిల్కుమార్ను వెంటపెట్టుకొని కారులో వచ్చాడు. అక్కడి నుంచి రవీందర్ను కిడ్నాప్ చేసి, అతిదారుణంగా కొట్టి చంపివేశారు. శవాన్ని కారులో పెట్టుకొని అక్కడి నుంచి కడ్తాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మక్తమాదారం గ్రామ పరిధిలోకి తీసుకెళ్లి ఖాళీ ప్రదేశంలో పడేసి, పెట్రోల్పోసి నిప్పంటించారు.
మరుసటి రోజు ఉదయం స్థానికులు గమనించిన కడ్తాల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తి శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఈనెల 30వ తేదీన గీత.. రవీందర్ కనిపించడంలేదంటూ అతడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ వారు సూచించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే కడ్తాల్లో కాలిపోయిన శవాన్ని పరిశీలించగా.. మృతి చెందిన వ్యక్తి రవీందర్గా గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. అనుమానంతో గీతను కూడా విచారించడంతో అసలు విషయం బయటపడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో యాదగిరి, అనిల్కుమార్తో కలిసి పథకం వేసి రవీందర్ను హత్య చేసినట్టు తెలిపారు. దీంతో గీత, యాదగిరి, అనిల్కుమార్ను అరెస్టు చేసి, వారి వద్దనుంచి కారు, హత్యకు ఉపయోగించిన వీల్రాడ్, పెట్రోల్ బాటిల్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించి, రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో శంషాబాద్ అడిషినల్ డీసీపీ రాంకుమార్, షాద్నగర్ ఏసీపీ రంగస్వామి, సీఐలు శివప్రసాద్, ప్రమోద్కుమార్, సత్యనారాయణతో పాటు పలువురు పోలీసులు ఉన్నారు.