కుత్బుల్లాపూర్, జూన్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని పాలనలో గ్లోబల్సిటీ అయిన హైదరాబాద్ నరకప్రాయంగా మారుతోందని కొంపల్లి శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన మౌలిక వసతులతో వర్ధిల్లిన భాగ్యనగరం..నేడు కనీస తాగునీరు, రవాణా సౌకర్యాలు లేక అస్తవ్యస్తంగా తయారైందని మండిపడ్డారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో కొంపల్లి సర్కిల్ శ్వేతాశుభం రెసిడెన్సీకి చెందిన కాలనీవాసులు, ఐటీ ఉద్యోగులు నందినగర్లోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తాము పడుతున్న అవస్థలను వారు కేటీఆర్కు వివరిస్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు తాగునీటి కష్టాలే లేవని కాలనీవాసులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నాడు కేటీఆర్ ఐటీ, పురపాలక శాఖమంత్రిగా ఉన్నప్పుడు రోజువిడిచి రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కలంగా తాగునీరు సరఫరా అయ్యేది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో ఐదు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయి. అది కూడా అత్యంత లో-ప్రెజర్తో వస్తుండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఐటీ ఉద్యోగులు, కాలనీవాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాగునీటి సమస్యే కాకుండా రవాణా పరంగా తాము ఎదుర్కొంటున్న నరకాన్ని ఐటీ ఉద్యోగులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
బోయిన్పల్లి నుంచి సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఫ్లైఓవర్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు మెట్రో విస్తరిస్తామని ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మెట్రో పొడిగింపు పనులపై ప్రస్తుత ప్రభుత్వం కనీస ముందడుగు వేయకపోవడంతో రోజురోజుకూ ట్రాఫిక్ నరకం పెరుగుతోందని, ప్రయాణ సమయం రెట్టింపవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అసెంబ్లీలోనూ, ఇతర వేదికలపైనా ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినా పాలకుల్లో కనీస చలనం లేకపోవడం దుర్మార్గమని స్థానికులు ధ్వజమెత్తారు.
కొంపల్లి శ్వేతా రెసిడెన్సీ వాసుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో వేలాది కోట్ల రూపాయాల నిధులతో హైదరాబాద్ ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించామన్నారు. నగరానికి వరదలా పెట్టుబడులను తీసుకువచ్చామని, కానీ కనీసం ఉన్న వసతులను కూడా నిర్వహించలేని అద్వాన స్థితిలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. శ్వేతా శుభం రెసిడెన్సీ వాసుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ తరపున రాజీలేని పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఐదు రోజులకొకసారి నీళ్లిచ్చే దుస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులను పునఃప్రారంభించడంతో పాటు నార్త్ సిటీకి మెట్రోను సాధించే వరకు కాంగ్రెస్ మెడలు వంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.