సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : జీర్ణవ్యవస్థకు, క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో కీలకంగా పనిచేసే ఫైబర్(పీచు) అధికంగా ఉండే ఆహారమే శరీరానికి ఎంతో మంచిది. ఆధునిక ఆహారపు అలవాట్లతో నిర్ణీత పరిమితిలో పీచు శరీరానికి అందడం లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో జీర్ణ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. మెరుగైన జీవనాన్ని అందించేలా ఆహారంలో పీచు అధికంగా ఉండే విధంగా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నూతన ఆహార పదార్థాలను తయారు చేసే టెక్నాలజీని రూపొందించింది. ఈ టెక్నాలజీతో తయారు చేసిన ఆహార పదార్థాల్లో పీచు పరిమాణం 36 నుంచి 52శాతం, ప్రోటీన్ పరిమాణం 12శాతం అధికంగా ఉండేలా ఉత్పత్తి చేసుకునే వీలు ఉంటుంది.
కొన్ని ప్రత్యేక విధానాల్లో గోధుమ ఊక (వీట్ బ్రాన్) ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. సాధారణ పద్ధతుల్లో ఉత్పత్తి చేసే తవుడు కంటే అధికంగా పోషకాలు ఉంటాయని సీఎఫ్టీఆర్ఐ పరిశోధకులు చెబుతున్నారు. బెంగళూరు కేంద్రంగా ఆహార ఉత్పత్తులపై అధ్యయనం చేసే ఈ సంస్థకు.. హైదరాబాద్, లక్నోతోపాటు, ఇతర ప్రాంతాల్లో నోడల్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల నుంచి పరిశోధనలు, ఆహార ఉత్పత్తులపై శిక్షణ, ఉత్పత్తికి అవసరమైన టెక్నాలజీని అందిస్తోంది.
ఆహారంలో పీచు పరిమాణం పెంచేందుకు అధ్యయనం చేసిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంస్థ… గోధుమ తవుడుతో చేసిన అధిక ఫైబర్ ఉండే ఆహార పదార్థాల ఉత్పత్తికి వినూత్న టెక్నాలజీని తయారు చేసింది. దీని ద్వారా వాటిలో సాధారణ ఆహార పదార్థాలతో పోల్చితే అధికంగా పోషక విలువలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గోధుమ నుంచి రవ్వ, పిండి, ప్లేక్స్ వంటి స్నాక్స్గా వినియోగించే ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. ఆహారంలో పోషకాలను పెంచడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ఆవిష్కరించినట్లు సీఎఫ్టీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ జ్యోతిర్మయి తెలిపారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయని వివరించారు. ఫైబర్లో ముఖ్యమైన ఆరిబినోగ్జేలిన్ సమ్మేళనం నష్టపోదని, దీనివల్ల పొట్టలో ప్రోబయాటిక్స్ పుష్కలంగా వృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ సమ్మేళనం ఇతర ఆహార పదార్థాలతో కలిసిన కూడా మరింత ఎక్కువగా పోషకాలు అభివృద్ధి చెందుతాయని, పొట్టకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని వాణిజ్యపరంగా అందిస్తున్నామని, శాస్త్రీయ, సాంకేతిక విధానంలో ఆహార పదార్థాల ఉత్పత్తిలో కీలకంగా మారుతుందన్నారు.