సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్పై పటిష్ట నిఘాను కొనసాగిస్తూ డ్రగ్ వినియోగదారుల చేతుల్లోకి వెళ్లకుండా సరఫరాదారులను ఎక్కడికక్కడే పట్టుకుంటున్నామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. కొరియర్, డెలివరీ సర్వీస్ల ద్వారా నడుస్తున్న డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసినట్లు వివరించారు. ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్ఓటీ, చైతన్యపురి, ఆదిభట్ల పోలీసులతో కలిసి మూడు వేర్వేరు ఘటనల్లో హెరాయిన్ , ఓపీయం, ఎండీఎంఏ డ్రగ్స్ను పట్టుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో సీపీ వివరించారు. రాజస్థాన్కు చెందిన దీపరామ్ బిష్ణోయ్ 2021లో కూకట్పల్లి ఎల్లమ్మ బండలో ఎస్ఎస్ రెయిలింగ్ అండ్ గ్రైనైట్ పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. అయితే, డ్రగ్స్కు అలవాటుపడ్డ దీపరామ్ తన అసలు వ్యాపారాన్ని వదిలేసి, రాజస్థాన్ నుంచి హెరాయిన్, ఎండీఎంఏ డ్రగ్ను తెప్పించి ఇక్కడ విక్రయించేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకు రాజస్థాన్లో డ్రగ్ సరఫరా చేసే రమేశ్ కుమార్ను సంప్రదించాడు. రాజస్థాన్లో రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు గ్రాము చొప్పున కొనుగోలు చేసి.. దానిని ఇక్కడ రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు గ్రాము చొప్పున విక్రయిస్తున్నారు.
రాజస్థాన్ నుంచి డ్రగ్స్ను ప్రైవేట్ బస్సులలో తెప్పించి, దానిని అవసరమైన వారికి హైదరాబాద్లో డెలివరీ సర్వీస్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఎస్ఓటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందానికి ఈ డ్రగ్స్ దందాపై సమాచారం రావడంతో.. మంగళవారం టెలిఫోన్ కాలనీ కమాన్ వద్ద చైతన్యపురి పోలీసులతో కలిసి నిఘా పెట్టారు. నిందితుడు రామ్ 70 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల ఎండీఎంఏను తీసుకొని వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకొని విచారించగా.. తనకు రమేశ్ కుమార్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడు. రమేశ్కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో డ్రగ్స్ విలువ రూ. 60 లక్షలకు పైగా ఉంటుందని సీపీ తెలిపారు. డెలివరీ సర్వీసుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని, దీని ద్వారా ఏయే డెలివరీ సంస్థ నుంచి నిందితుడికి సంబంధాలు ఉన్నాయనే విషయాలపై ఆరా తీస్తున్నామని సీపీ వివరించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఓపీయం పండిస్తూ…
రాజస్థాన్కు చెందిన మహేందర్ సింగ్ 10 ఏండ్ల కిందట హైదరాబాద్కు జీవనోపాధి కోసం వచ్చి.. పాన్ బ్రోకర్ వ్యాపారం చేస్తున్నాడు. లాక్డౌన్ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాజస్థాన్లో తానే స్వయంగా ఓపియం డ్రగ్ తయారు చేసే మొక్కలను పెంచి.. డ్రగ్స్ను తయారు చేసేందుకు ప్లాన్ చేశాడు. తాను డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. దీంతో తనతో పాటు బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు ప్లాన్ చేసి, తన స్వస్థలంలో ఓపీయం పండిస్తున్నాడు. అక్కడి నుంచి కారం పౌడర్, సజ్జలు తదితర వస్తువుల మాదిరిగా ప్యాక్ చేసి.. వాటిని ప్రైవేట్ బస్సులలో రవాణా చేసి హైదరాబాద్కు తెప్పిస్తున్నాడు. ఇలా వచ్చిన డ్రగ్స్ను రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు 10 గ్రాముల చొప్పున విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో.. తుర్కయాంజల్లోని రాంనగర్ కాలనీలో బుధవారం నిందితుడి ఇంట్లో తనఖీలు చేయగా.. 2.25 కిలోల ఓపియం పట్టుబడింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతని సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను ఆదిభట్ల పోలీసులు చేపట్టారు.