సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మెదక్ నియోజకవర్గం పరిధిలోని పటాన్చెరు, మహబూబ్నగర్ నియోజకవర్గం పరిధిలోని షాద్నగర్ తదితర ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలతోపాటు పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దులు, డీసీపీ జోన్ల సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి చెక్పోస్ట్ వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, ఆబ్కారీ, ఐడీ, రెవెన్యూ అధికారులు సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. బయట నుంచి కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించే వాహనాలు, కమిషనరేట్ పరిధిలో నుంచి బయటకు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బును తరలిస్తూ.. తనిఖీల్లో సరైన పత్రాలు చూపించని నగదును సీజ్ చేసి, ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు. నగదుతో పాటు ఓటర్లను మభ్యపెట్టేందుకు రవాణా చేసే మద్యంపై కూడా ఆబ్కారీ శాఖ అధికారులతో పాటు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో రూ. 1.60 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.50 లక్షల విలువైన మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను కూడా పట్టుకుని, సీజ్ చేశారు. సాధారణ ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు సరైన పత్రాలు వెంట పెట్టుకోవాలని, అధికారులు తనిఖీ చేసిన సమయంలో నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించాలంటూ పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎవరైనా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు వంటివి రవాణా చేసినా, పంపిణీ చేసినా.. ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి హెచ్చరించారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): లోకసభ ఎన్నికల నేపథ్యం.. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.28 కోట్ల నగదును పట్టుకొని, సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.కోటి 13 లక్షల విలువ గల ఇతర వస్తువులు పట్టుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు 18,752 లీటర్ల మద్యం పట్టుకొని, 122 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 2,144 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేశారని చెప్పారు. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.9.54 లక్షలు పట్టుకున్నట్లు తెలిపారు. ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.