అంబర్పేట/మెహిదీపట్నం, జూలై 28: నగరంలో మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ కమిషన్ రోనాల్డ్ రాస్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అంబర్పేట నియోజకవర్గం, నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్ వెంకటేశ్లతో కలిసి ఎమ్మెల్యే జాఫర్ మెరాజ్ హుస్సేన్ అహ్మద్నగర్ డివిజన్లో ప్రవహిస్తున్న బుల్కాపూర్ నాలా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అంబర్పేట పరిధిలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి కమిషనర్ నల్లకుంట డివిజన్ పరిధిలోని రత్నానగర్ వద్ద హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మాణం, అంబర్పేట డివిజన్లోని పటేల్నగర్లో ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన నాలా నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొదట రత్నానగర్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం విషయమై కమిషనర్కు వివరించారు.
అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో ఎస్ఎన్డీపీ కింద నిర్మిస్తున్న నాలా పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ ప్రణాళికలు అమలు చేసింది. అన్నీ శాఖలను రంగంలోకి దించి సురక్షిత చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చెట్లు విరిగిపడటం, నీళ్లు నిలిచిపోవడం, రిస్క్యూ తదితర వాటి కోసం గురువారం నుంచి శుక్రవారం వరకు వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే స్పందించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) టీంలు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాయి. చెట్లు విరిగిపడినట్టు 22 ఫిర్యాదులు, ఒకే చోట నీరు నిలిచిపోవడంపై 9 ఫిర్యాదులు, రిస్క్యూ-1 ఇలా వచ్చిన అన్ని ఫిర్యాదులను డీఆర్ఎఫ్ పరిష్కరించింది. కాగా, ఈ నెల 20 నుంచి 28 వరకు మొత్తం 421 ఫిర్యాదులు డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్కు వచ్చాయి. వాటన్నింటిని సకాలంలో పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలు అండగా నిలిచాయి.