పెద్దపల్లి జిల్లాలో మినీ జల విద్యుత్ కేంద్రాలకు జీవం
నాడు జలంలేక ఏండ్లపాటు నిర్వీర్యం
నేడు గోదారి జలాలతో పూర్వ వైభవం
డీ-83కి నిరంతర నీటి సరఫరా
రెండేళ్ల నుంచి విద్యుదుత్పత్తి
గతేడాది 15.25లక్షల యూనిట్లతో రికార్డు
గడిచిన 26 రోజుల్లోనే 3.11లక్షల యూనిట్లతో దూకుడు
టీఎస్ జెన్కో హర్షం
పెద్దపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో హైడల్ పవర్ జిగేల్మంటున్నది. రాష్ట్ర సర్కారు చర్యలతో మళ్లీ కాంతులీనుతున్నది. ఎస్సారెస్పీ డీ-83 కెనాల్పై 35 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ మినీ విద్యుత్ కేంద్రాలు ఇన్నాళ్లూ నిర్వీర్యం కాగా, మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నాయి. కాళేశ్వరం పుణ్యమాని కెనాల్కు నిరంతర నీళ్లు వస్తుండడంతో రెండేళ్లుగా పుష్కలంగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. 2019-20లో 12.35లక్షల యూనిట్ల పవర్ జనరేట్ కాగా, గతేడాది 15.25లక్షల యూనిట్లతో రికార్డు సృష్టించింది. ఈ యేడు గడిచిన 26 రోజుల్లోనే 3,11,469 యూనిట్లతో దూసుకుపోతుండగా, జెన్కో యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
పెద్దపల్లి జిల్లాకు ఎస్సారెస్పీ నీళ్లే ఆధారం. రెండు కాలువల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అందులో ఒకటి డీ-83 కాగా, మరొకటి డీ-86. సాధారణంగా విద్యుత్ తయారీకి నిరంతర నీటి ప్రవాహం ఉండాలి. అయితే కాకతీయ కాలువకు అతి పెద్ద డిస్ట్రిబ్యూషన్ కాలువగా డీ-83 ఉండేది. దీనిపైనే 1986-87లో జెన్కో ఆధ్వర్యంలో 9.16మెగావాట్ల సామర్థ్యంతో 10 మినీ హైడల్ జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూలపల్లి మండలం కాచాపూర్ వద్ద ఒకటి, కుమ్మరికుంట వద్ద రెండు, పెద్దపల్లి మండలం చందపల్లి వద్ద మూడు, ధర్మారం మండలం తుర్కల మద్దికుంట వద్ద రెండు, కమ్మర్ఖాన్పేట వద్ద రెండు సెంటర్లు నెలకొల్పారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ను ఎన్పీడీసీఎల్కు విక్రయిస్తున్నారు.
ఉత్పత్తి అంతంతే..
ఈ కేంద్రాల ద్వారా మొదట్లో విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగానే జరిగినా కాలక్రమేణా తగ్గిపోయింది. డీ-83 నుంచి ఎన్టీపీసీకి నిరంతర నీటి సరఫరా జరిగేది. అయితే శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచే సరఫరా జరుగుతుండడంతో ప్రవాహం తగ్గిపోయింది. కేవలం పంటల సాగుచేసే సమయంలోనే వచ్చే జలాలతో మాత్రమే నడిచేది. విద్యుదుత్పత్తి కూడా అదే సమయానికి పరిమితమయ్యేది. ఇదేగాకుండా ఎస్సారెస్పీలోనూ నీరు సరిపడా లేకపోవడం, కాలువల్లో నీటి ప్రవాహం ఆగిపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు.
పెరిగిన ఉత్పత్తి..
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సారెస్పీపై భారం తగ్గింది. ప్రాజెక్టు నుంచి ఇతర జిల్లాలకు నీరందించే అవసరం లేకుండా పోయింది. దాంతో ప్రాజెక్టులో పుష్కలంగా జలాలు ఉండడంతో గతేడాది నుంచి కాలువలకు నీటి ప్రవాహం పెరుగుతున్నది. జిల్లాలోని హైడల్ విద్యుత్ కేంద్రానికి జీవం వచ్చి విద్యుదుత్పత్తి పెరిగింది. 2019-20ఆర్థిక సంవత్సరంలో 12,35,016యూనిట్ల విదుత్ ఉత్పత్తి కాగా, 2020-21లో మరింత ప్రవాహం పెరగడంతో 15,25,121 యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. అంటే 2,90,105యూనిట్లు అదనంగా ఉత్పత్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఏప్రిల్ నెల 26వరకు 3,11,469యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు.
విద్యుదుత్పత్తి ఇలా..
హైడల్ విద్యుత్ ఉత్పత్తికి నీటి ప్రవాహం అవసరం. సాధారణంగా ఎగువ నుంచి దిగువకు నీటి ప్రవాహం ఉన్నచోటే ఏర్పాటు చేస్తారు. కానీ, పెద్దపల్లిలో అందుకు భిన్నంగా సమాంతర ప్రవాహంలోనూ ఉత్పత్తి జరిగేలా నెలకొల్పడం జెన్కో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇక విద్యుత్ ఉత్పత్తి విషయానికి వస్తే సమాంతర పద్ధతి కావడంతో కెనాల్లో ప్రవాహాన్ని పెంచేందుకు హైడల్ ప్రాజెక్టులపై డ్రాప్లను ఏర్పాటు చేశారు. వీటిలోకి చేరిన నీటిని ఒడిసిపట్టేందుకు కాలువ పక్కనే మరో పెద్ద కాలువ ఉంటుంది. దానిపైనే హైడల్ విద్యుత్ కేంద్రాలను నిర్మించారు. మెయిన్ కాలువ గేట్లు వేయగానే ఒక్కసారిగా నీరు డైవర్షన్ అయ్యి జెన్కో కాలువ.. ఆ తర్వాత విద్యుత్ కేంద్రంలోని ఇంటెక్ గేట్లోకి వెళ్తుంది. అక్కడ గేట్లు ఎత్తడంతో ఇంటెక్ గేట్లో ఉన్న నీరు టర్బైన్లోకి చేరుతుంది. రన్నర్ బీడ్తో కలిసి గేర్బాక్స్లోకి వెళ్లి జనరేటర్ వీల్ను తిప్పుతుంది. ఆ జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా సబ్స్టేషన్లకు సరఫరా అవుతుంది.
పోచంపాడు తర్వాత జిల్లాలోనే..
రాష్ట్రంలో మినీ హైడల్ జల విద్యుత్ కేంద్రాలు ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద కాకతీయ కెనాల్పై ఉండేవి. ఈ విధానంలో తొలి విద్యుత్ ఉత్పత్తి జరిగింది అక్కడే. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలోనే ఏర్పాటు చేశారు. 1986-87లో జిల్లాలోని డీ-83 కెనాల్పై 10 మినీ హైడల్ జల విద్యుత్ కేంద్రాలను నిర్మించారు.
చందపల్లిలో జెన్కో ప్రత్యేక కార్యాలయం..
ఈ హైడల్ విద్యుత్ కేంద్రాల పర్యవేక్షణ కోసం ఎస్సారెస్పీ, జెన్కో కాలువల నడుమ జెన్కో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో డీఈఈ, ఏఈఈతో పాటు ఇతర సాంకేతిక, కార్యాలయ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. ఇక్కడి నుంచే విద్యుత్ ఉత్పత్తి, ఇతర కార్యకలాపాలు నిర్వర్తిస్తుంటారు.