ఖైరతాబాద్, జనవరి 24 : కళలు, సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణలో ప్రభుత్వం వాటికి విశేష ఆదరణ కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆద్యకళ మ్యూజియం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గోరటి వెంకన్న మాట్లాడుతూ ఉత్పత్తి కులాలకు సంబంధించిన వాయిధ్యాలు, పరికరాలకు అస్తిత్వం ఉందని, ఇక్కడి కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపునిచ్చిందని, పద్మశ్రీ పురస్కార గ్రహీత కిన్నెర మొగిలయ్య లాంటి వారికి సముచిత స్థానం కల్పించి అలాంటి వారికి పెద్ద పీట వేసిందన్నారు. ఆద్యకళ రక్షణ అంశం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, కళలు, సంస్కృతి, కళాకారులపై ఆయనకు ఉన్న మక్కువ గొప్పదన్నారు. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా దీనిని పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆద్యకళ రక్షణ జయధీర్ తిరుమల రావు తపన ఇందులో కనిపిస్తుందని, ఆద్యకళ ప్రజా సాంస్కృతిక జీవనవిధానానికి సంబంధించినదని, వాటిని పదిల పర్చుకోవాలన్నారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, నాగరికత వికాసాన్ని ప్రతిబించే ఆధ్యకళా పనిముట్లు, పరికరాలు, విశేషాలను భద్రపర్చడమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం, వికాసంలో భాగంగా మన అస్తిత్వానికి ప్రతీక నిలిచిన ఆద్యకళా రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆద్యకళల కోసం అనేక సంవత్సరాలుగా జయధీర్ తిరుమల్ రావు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన కల నెరవేరాలంటే ప్రభుత్వం చొరవతోనే సాకారమవుతుందన్నారు. ఈ సమావేశంలో రచయిత డాక్టర్ ఏకే ప్రభాకర్, ‘మట్టి మనిషి’ వేనేపల్లి పాండురంగారావు, డాక్టర్ చొల్లేటి ప్రభాకర్, పొట్లపల్లి వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు కందుకూరి రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.