మేడ్చల్, మార్చి 12(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది పలు చెరువులలో చేప పిల్లల వదిలివేతకు జిల్లా మత్స్య శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. 63 లక్షల చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. చేప పిల్లల వదిలివేతకు జిల్లాలో 233 చెరువులను గుర్తించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీపై చెరువులలో చేప పిల్లలను విడుదల చేసే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి యేట చెరువులు నిండిన తర్వాత మత్స్య శాఖ చేప పిల్లలను వదిలివేస్తుంది. మత్స్యశాఖ పరిధిలోని పలు చెరువులను స్థానిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మత్స్య శాఖ కౌలుకు ఇస్తుంది. చెరువులలో చేప పిల్లల వదిలివేయడం వల్ల మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో సహకరిస్తుంది.
జిల్లాలో 80 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. సహకార సంఘాలలో 3,474 సభ్యులున్నారు. మహిళ 13 పారిశ్రామిక సహకార సంఘాలకు గాను 700 మంది మహిళా సభ్యులు ఉన్నారు. పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యత్వం ఉన్న మత్య్యకారులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమయ్యే వివిధ రకాల పరికరాలను సబ్సిడీపై అందించింది. ఇప్పటి ప్రభుత్వమే సబ్సిడీపై పరికరాలను అందిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మహిళ మత్స్య పారిశ్రామిక సంఘాలకు చెందిన మహిళలు చేపలు అమ్ముకోవడం, రంగు చేపల ఉత్పత్తి, చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందుతున్నారు. సంచార మత్స్య విక్రయ వాహనాలు 60 శాతం సబ్సిడీపై అందించారు. గత యేడు 333 చెరువులలో 68 లక్షల చేప పిల్లలను వదలగా ఈ యేడు 63 లక్షల చేప పిల్లలను మాత్రమే 233 చెరువులలో విడుదల చేయనున్నారు.