సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : సహజసిద్ధంగా భూసారాన్ని పెంచేలా ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. కృత్రిమ ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగుతో అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు చేస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగంలో సూక్ష్మపోషకాల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్రిసాట్ అమలు చేస్తున్నది.
భూమికి పునరుజ్జీవం పోసేలా ఇక్రిసాట్ ముందుకు సాగుతున్నది. ఇప్పటికే చవుడు నేలల్లో పంటల సాగు, మెట్ట భూముల్లో అధిక దిగుబడిని సాగించేలా పలు ఆధునిక విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు అధిక దిగుబడి, కొత్త వంగడాలు, జెనిటిక్ మార్పులతో విత్తనోత్పత్తిని పెంచేలా ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నది. ముఖ్యంగా కృత్రిమ ఎరువుల వినియోగం, వాడకంపై అవగాహన లేకపోవడంతో భూముల్లో రసాయన అవశేషాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఏటా పంటల దిగుబడి తగ్గడంతోపాటు, కృత్రిమ ఎరువుల వాడకం పెరిగి రైతులకు ఆర్థికభారం పడుతుంది. ఈ క్రమంలో భూముల సాగుకు అనుకూలమైన విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది.
సహజసిద్ధంగా భూసారాన్ని పెంచడమే లక్ష్యంగా ఇక్రిసాట్ పరిశోధనలను విస్తృతం చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని పలు జిల్లాల నుంచి సాయిల్ శాంపిళ్లను సేకరించిన ఇక్రిసాట్ సూక్ష్మపోషకాల నిల్వలను పరిశోధిస్తున్నది. మొక్కకు అవసరమైన సూక్ష్మపోషకాలను సహజంగా పెంచేందుకు వీలున్న అవకాశాలను ఆయా ప్రాంతానికి అనుగుణంగా గుర్తించనున్నది. దీంతోపాటు నీటి లభ్యతను బట్టి మట్టిలో పోషకాల పరిమాణంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో నీటి ఎద్దడి భూములకు వీలుగా సాయిల్ అసెస్మెంట్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సాధారణ సాయిల్ టెస్టుల కంటే మరింత లోతుగా నేల నాణ్యతను పరిశీలించి దానికి అనుగుణంగా పంటల సాగును పెంచడానికి వీలు పడుతుందని ఇక్రిసాట్ వర్గాలు వెల్లడించాయి.
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నానాటికి పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రజల ఆరోగ్య ప్రమాణాలతోపాటు, వ్యవసాయ రంగానికి ప్రతికూలంగా మారుతుంది. దీంతో పంటల దిగుబడి, చీడ పీడల తీవ్రత ఏటా పెరుగుతూనే ఉన్నది. జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార పంటల ఉత్పత్తి లేకపోవడంతో అధిక ధరలు, రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో లాభసాటి వ్యవసాయానికి అనుకూలమైన విత్తనాలను ఇక్రిసాట్ ఉత్పత్తి చేస్తున్నది.
ఇక్రిసాట్ వ్యవసాయ రంగంలో జెనిటిక్ టెక్నాలజీని వినియోగించి ఆధునిక వంగడాలను అభివృద్ధి చేస్తున్నది. గతంలో నేల స్వభావాన్ని బట్టి వంగడాలను అభివృద్ధి చేసిన పరిశోధకులు.. ఇప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి వంగడాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఏటా పెరుగుతున్న ఆహార పంటల డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేలా ప్రత్యేక వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇక్రిసాట్ కొత్త వంగడాలపై దృష్టి సారించింది. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, నీటి ఎద్దడి, కరువు ప్రభావిత ప్రాంతాల్లోనూ మొక్క ఎదుగుదల, పూత, చీడ పీడలు, వేరు పురుగు వంటి ఇబ్బందులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో చిక్ పీస్, పల్లీ, కందులు, జొన్నలు, మిల్లెట్స్ తదితర రకాలు ఉండగా.. ఇవన్నీ అధిక దిగుబడి, ఆహార పంటల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా జన్యు మార్పిడితో అందుబాటులోకి తీసుకువచ్చింది. 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో పంటల దిగుబడిపై ఏమాత్రం ప్రభావం పండకుండా సాగు ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుందని ఇక్రిసాట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉత్తర, దక్షిణ భారతంలోని ప్రాంతాల వారీగా వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా.. పూర్తి స్థాయిలో ఇక్రిసాట్ నూతన వంగడాలు అందుబాటులోకి రానున్నాయి.