సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకుంది. గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్లాల్ నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును పురపాలక పట్టణాభివృద్ధి కార్యదర్శి డాక్టర్ కె.ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వీకరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సర్వేలో 10 లక్షలు ఆపై జనాభా కలిగిన వ్యర్థాల రహిత నగరం కేటగిరీలో ఉత్తమ ప్రతిభ చూపిన గ్రేటర్ హైదరాబార్ 6వ ర్యాంక్తో 7 స్టార్ రేటింగ్ పొందింది.
ఓడీఎఫ్లో వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కూడా జీహెచ్ఎంసీకి దక్కింది. గత సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ 9వ ర్యాంక్తో 5 స్టార్ హోదా పొందింది. అవార్డుల స్వీకరణ కార్యక్రమంలో శానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎస్ఈ కోటేశ్వర రావు, ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును సాధించిన సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డు రావడంలో కీలక పాత్ర పొషించిన జీహెచ్ఎంసీ కమిషనర్, సంబంధిత అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు మేయర్ అభినందనలు తెలిపారు.
కంటోన్మెంట్, జూలై 17: క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుభ్రత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా జాతీయస్థాయిలో మినిస్టీరియల్ విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుకు ఎంపికైంది.ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేతుల మీదుగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఈఓ పల్లవి, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, బోర్డు అధికారి దేవేందర్ అందుకున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు ఎంపిక కావడానికి సేవాస్థాయి పురోగతి, నాణ్యమైన చెత్త సేకరణ, ప్రత్యేకంగా వాహనాల నిర్వహణ, పారిశుధ్య పనితీరు, సర్టిఫికేషన్ విధానంతో పాటు పలు అంశాల్లో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావడం, వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టడం, స్వచ్ఛ యాప్ ఉపయోగించడం వంటి అంశాలు కంటోన్మెంట్ అవార్డుకు ఎంపిక కావడంలో ప్రధానంగా ఉన్నాయి. అవార్డు రావడంపై కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో బోర్డు ప్రజల ఐక్యత, వారి భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషించాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కడంపై బోర్డు ప్రజలకు అభినందనలు తెలిపారు.