మన్సూరాబాద్, ఫిబ్రవరి 21 : ఆడుకుంటూ బయటకు వెళ్లి అదృశ్యమైన నాలుగు సంవత్సరాల చిన్నారిని అరగంట లోపు పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డి కథనం ప్రకారం.. మన్సూరాబాద్, చంద్రపురికాలనీ రోడ్డు నెం. 3లో శివశంకర్, సునీత దంపతులు నివాసముంటున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల కూతురు ఆద్య ఉంది. శివశంకర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు.
సెంట్రల్బ్యాంకు కాలనీలోని కాకతీయ స్కూల్లో చిన్నారి ఆద్య నర్సరీ చదువుతున్నది. తల్లి సునీత ఇంట్లో పనిలో ఉండగా మంగళవారం సాయంత్రం 4:15 గంటల సమయంలో ఆడుకుంటూ చిన్నారి బయటకు వచ్చింది. అరగంట అనంతరం తల్లి గమనించి పరిసర ప్రాంతాల్లో వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. కాలనీల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా సూర్యోదయనగర్ కాలనీ రోడ్డు నెం.4లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం వద్ద చిన్నారి ఆడుకుంటూ కనిపించింది. సాయంత్రం 6:30 గంటల సమయంలో గుర్తించిన పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.