శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 22 : భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 71.620 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన మారుతీ రాథోడ్ డ్రైవర్. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కొంతమందితో చేతులు కలిపాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొచ్చి నారాయణఖేడ్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు.
గంజాయి తరలిస్తున్నట్లు పక్క సమాచారం అందుకున్న ఎస్వోటీ, శంషాబాద్ పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎస్ఐ రాజ్కుమార్ తన సిబ్బందితో కలిసి పెద్దగోల్కొండ ఔటర్రింగ్ రోడ్డు సమీపంలోని స్వీస్ రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డుపక్కన ఆగి ఉన్న ఓ కారును గుర్తించారు. ఈ కారులో మారుతీ రాథోడ్ అనే వ్యక్తి ఉన్నాడు. కారును తనిఖీ చేశారు. ఐదు కిలోల చొప్పున బరువున్న 14 ప్యాకేట్లలో 71.620 కిలోల గంజాయి బయటపడింది. దీంతో మారుతీ రాథోడ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. జైపాల్, మల్లికార్జున్తో కలిసి ఈ దందా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.