కవాడిగూడ, సెప్టెంబర్ 1: నగరంలోని నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి ఏటా ఒక ఫీటు నుంచి భారీ వినాయక విగ్రహాలను హుస్సేన్సాగర్లో భక్తులు పెద్ద ఎత్తున నిమజ్జనం చేసేవారు. అయితే ఈ సారి వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు ప్రత్యేకంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిమజ్జనానికి అవసరమైన కొలనులను ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంలో ఒక ఫీటు నుంచి 5 ఫీట్ల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి స్టేడియంలోని మూడు చోట్ల కొలనులు ఏర్పాటు చేశారు. నిమజ్జనం చేసేంత వరకు ఈ కొలనులు అందుబాటులో ఉంటాయని జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు..
ఎన్టీఆర్ స్టేడియంలో వారం రోజులుగా జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను గురువారం నగర అదనపు సీపీ డీఎస్ చౌహాన్, సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్చంద్ర, అదనపు డీసీపీ రమణారెడ్డి, ట్రీఫిక్ అదనపు సీపీ మురళి, చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసీపీ ఎ. యాదగిరి పరిశీలించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అదే విధంగా నిమజ్జనం అయ్యేంత వరకు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వీరితో పాటు గాంధీనగర్ ఇన్స్స్పెక్టర్ ఎన్. మోహన్ రావు, చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ దారవత్ నానునాయక్, ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.