సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ముక్తిరాజ్ బాధితుల నుంచి సేకరించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. హబ్సిగూడలో ఈ ఏడాది జూలైలో రియల్ లైఫ్ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో సంస్థను ప్రారంభించాడు.
నెల రోజుల్లోనే పేరును మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చేసిన అతడు.. తన సంస్థలో మహారాష్ట్రకు చెందిన మోతీలాల్ సర్కార్, ప్రశాంత్ ఎక్నాథ్ బురండిలను డైరెక్టర్లుగా నియమించుకున్నాడు. ట్రేడింగ్ పేరుతో గొలుసుకట్టు విధానంలో వేలాది మందిని సభ్యులుగా చేర్చుకున్న ముక్తిరాజ్, మూడున్నర నెలల్లోనే సుమారు రూ. 150 కోట్ల వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని శనివారం అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద సంఖ్యలో సీసీఎస్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామంటూ పోలీసులు నచ్చజెప్పారు. ఈ క్రమంలోనే నిందితుడిని కస్టడీలోకి తీసుకొని రికవరీపై ఫోకస్ పెట్టనున్నారు.
డబ్బంతా ఎక్కడ..?
ముక్తిరాజ్ ట్రేడింగ్ పేరుతో బాధితుల నుంచి సేకరించిన సొమ్మంతా ఏం చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడి పాత నేరచరిత్రను కూడా పోలీసులు తవ్వుతున్నారు. ముక్తిరాజ్ బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఇక్కడ సంపాదించిన సొమ్ముతో ఎక్కడ ఆస్తులు కొన్నాడు, ఎవరైనా బినామీలు ఉన్నారా.? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వారం రోజులుగా బాధితుల నుంచి స్టేట్మెంట్ల రూపంలో వివరాలు సేకరిస్తున్నారు. వారిచ్చిన సమాచారంతో బాధితుల జాబితాను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, ఇప్పుడు రికవరీపై దృష్టిసారించారు.