పాత కస్టమర్లకు మేనేజర్ కౌంటర్ వద్దే విక్రయం
మైనర్లనూ అనుమతించిన పబ్బు
పబ్బుకు రప్పించేందుకు ఆకర్షణీయ ప్రకటనలు
గోవా, ముంబై, బెంగళూరు నుంచి కొకైన్ సరఫరా
అభిషేక్ కీలక పాత్రధారి
డ్రగ్స్ నెట్వర్క్తో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా
అభిషేక్,అనిల్, అర్జున్, కిరణ్రాజులపై దర్యాప్తు
అంతర్రాష్ట్ర, నైజీరియన్ కాంటాక్టులపై పోలీసుల దృష్టి
కాంగ్రెస్ మాజీ ఎంపీ అల్లుడి పాత్ర ఉన్నట్టేనా.?
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో పోలీసులకు లభించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పబ్బు నిర్వాహకులైన ఉప్పల్ అభిషేక్, అర్జున్ వీరమాచినేని, మేనేజర్ అనిల్కుమార్లతో పాటు వీళ్లకు సబ్ లీజు ఇచ్చి, ప్రస్తుత నిర్వాహకులతో వ్యాపారంలో చురుకుగా పాల్గొంటున్న కిరణ్రాజుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కిరణ్రాజ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీకి అల్లుడు కావడం గమనార్హం. ఈ నలుగురు పబ్బుకు కస్టమర్లను రప్పించేందుకు వివిధ రకాలైన ఆకర్షణీయ ప్రకటనలతో వారి వారి గ్రూప్లలో మార్కెటింగ్ చేస్తుంటారని విచారణలో తేలింది.
మైనర్లకు సభ్యత్వం
పబ్బులోకి మైనర్లకు అనుమతి ఉండదు. కానీ నిర్వాహకులు అదేది పట్టించుకోకుండా మైనర్లకు సభ్యత్వం ఇస్తూ.. వారి పేరును పామ్ యాప్లో నమోదు చేసి కోడ్ను సైతం అందించారు. ఆ కోడ్ చూపిస్తే లోపలికి అనుమతి ఉంటుంది. కాగా పాత కస్టమర్ల ద్వారా వచ్చిన మైనర్లను కూడా లోపలికి అనుమతించినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు కేవలం పబ్బులోకి అనుమతి పొందేందుకు తమ ఆధార్కార్డులపై పుట్టిన తేదీలను కూడా మార్చేసినట్లు తెలుస్తున్నది.
బర్త్ డే పార్టీలకు.. వీకేండ్ పార్టీలకు..
అర్ధరాత్రి తరువాత కూడా అందుబాటులో ఉండే పుడ్డింగ్ పబ్బులోకి కొందరు బర్త్డే పార్టీ కోసం వస్తే మరికొందరు వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేసేందుకు వచ్చారు. ఇక్కడకు వచ్చే నమ్మకమైన పాత కస్టమర్లకు కొకైన్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొకైన్ను అవసరమైన వారికే ఇచ్చేందుకు మేనేజర్ కౌంటర్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్డే పార్టీలకు వచ్చిన వారిలోను కొందరు పాత కస్టమర్లు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి తరువాత మూడు టేబుల్స్పై బర్త్డే పార్టీలు జరుగగా.. పార్టీలకు కావాల్సిన కేక్లను కూడా ఇక్కడి నుంచే తీసుకున్నారు. 1850చదరపు అడుగుల్లో ఉన్న పబ్బు 150 మంది యువతి, యువకులతో నిండిపోయి ఉంది. పబ్బులోకి పోలీసులు ప్రవేశించిన సమయంలో తక్కువ వెలుగుతున్న లైట్లు ఉండగా.., అందులో ఎవరికి వారు ఎంజాయ్మూడ్లో ఉన్నారు. పోలీసులను చూసి కొందరు తమ చేతులు, జేబుల్లో ఉన్న డ్రగ్స్ను కిందపడేశారు. కానీ పోలీసులు వచ్చి కౌంటర్ వద్దనే ఉండటంతో మేనేజర్ వద్ద కౌంటర్లో ఉన్న కొకైన్ ప్యాకెట్లను అక్కడి నుంచి పక్కకు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మేనేజర్ కౌంటర్లో పోలీసులకు రెడ్హ్యాండెడ్గా డ్రగ్స్ దొరికిపోయాయి.
అభిషేక్ పాత్రపై అనుమానాలు..!
నిర్వాహకులలో ఒకరైన అభిషేక్ మిగతా ఇద్దరికంటే చురుకుగా వ్యవహరిస్తుంటాడు. వివిధ రాష్ర్టాలకు కూడా వెళ్లివస్తుంటాడు. గోవా, ముంబాయి, బెంగళూర్ కాంటాక్టు నంబర్లను కూడా అతడి సెల్ఫోన్లో పోలీసులు గుర్తించారు. దీంతో పాటు నైజీరియన్స్తోనూ టచ్లో ఉన్నట్లు పోలీసులు అనుమానించి అతడి సెల్ఫోన్ డాటాను పూర్తిగా విశ్లేషిస్తున్నారు. సెల్ఫోన్లో సెలబ్రెటీలు, గతంలో డ్రగ్స్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారి ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అభిలాష్కు డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. కొకైన్ ఎక్కువగా గోవా, ముంబై, బెంగళూర్ నుంచి హైదరాబాద్కు వివిధ మార్గాల్లో సరఫరా అవుతున్నట్లు గతంలో పట్టుబడిన కేసుల్లో బయటపడింది. దీంతో డ్రగ్స్ను ఇతర రాష్ర్టాల నుంచి కొని, నమ్మకం కుదిరిన తరువాత అవసరమైన వారికి మాత్రమే సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్వాహకులతో పాటు మేనేజర్ సెల్ఫోన్ను విశ్లేషిస్తే పోలీసులకు డ్రగ్స్ నెట్వర్క్కు సంబంధించిన పక్కా సమాచారం లభిస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు.
కస్టడీతోనే అన్ని విషయాలు
ఇప్పటికే అరస్టైన అనిల్కుమార్, అభిషేక్లను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారంపై స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. కస్టడీపై ఒకటి రెండు రోజుల్లోనే న్యాయస్థానం నిర్ణయం వెలువరించే అవకాశముంది. ఇప్పటికే సేకరించిన సాంకేతిక పరమైన అంశాలను, నిందితులను విచారించి, పోలీసులు పక్కా సమాచారాన్ని రాబట్టనున్నారు. దీంతో పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్కు సంబంధించిన కీలకమైన ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది.
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో డ్రగ్స్ విక్రయిస్తున్నది ఎవరనే ప్రశ్నలకు అన్నివేళ్లు పబ్బు నిర్వాహకుడైన అభిషేక్, పబ్బును లీజుకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీ అల్లుడు కిరణ్రాజ్ వైపే చూపుతున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలతో కస్టమర్లను ఆకట్టుకుంటూ.. నిబంధనలు తుంగలో తొక్కి మైనర్లకు సైతం సభ్యత్వం ఇస్తూ.. అనుమతి లేకున్నా లోపలికి రానిస్తూ.. ఎంజాయ్ చేసేందుకు వీరు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నది. అంతటితో ఆగకుండా మేనేజర్ కౌంటర్ నుంచే కొకైన్ సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమవుతున్నది. చురుగ్గా ఉంటూ.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తూ.., నైరీజియన్లతో టచ్లో ఉంటూ.., గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారితో సంబంధం ఉన్న అభిషేక్పైనే అనుమానాలు బలంగా ఉన్నాయి. నలుగురినీ కష్టడీలోకి తీసుకుని సెల్ఫోన్లను విశ్లేషిస్తే పోలీసులకు డ్రగ్స్ నెట్వర్క్కు సంబంధించిన పక్కా సమాచారం లభించే అవకాశం లేకపోలేదు.