సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): జాతీయ దర్యాప్తు సంస్థల కండ్లు గప్పి సింథటిక్ డ్రగ్స్ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండేండ్ల నుంచి ఈ అక్రమ దందా నడుస్తున్నా.. జాతీయ దర్యాప్తు సంస్థలు గుర్తించలేదు. తాజాగా, తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తమిళనాడు కేంద్రంగా తయారైన ఎపిడ్రిన్ సింథటిక్ డ్రగ్స్ను హైదరాబాద్ మీదుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాచకొండ ఎస్ఓటీ, హెచ్న్యూ పోలీసులు గుర్తించి, సరఫరాను అడ్డుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్న విషయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఇతర జాతీయ దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లారు.
ఇక ఇతర రాష్ర్టాలపైనే దృష్టి..
హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ), సిటీ టాస్క్ఫోర్స్, రాచకొండ ఎస్ఓటీ పోలీసులు నిఘాను పెంచారు. గోవా డ్రగ్స్ డాన్ల ఆటకట్టించిన తెలంగాణ పోలీసులు, అక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా చేయడంలో మంచి ఫలితాన్ని సాధించారు. ఇక ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై నిఘాను పెంచారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రూ. 9 కోట్ల విలువైన 8.5 కిలోలు, తాజాగా హెచ్న్యూ, నార్త్జోన్ పోలీసులు బేగంపేటలో రూ. 3 కోట్ల విలువైన 3.01 కిలోల సూడో ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై కేంద్రంగా ..
ఈ రెండు ఘటనల్లో డ్రగ్ ట్రాన్స్పోర్టర్లు, కొరియర్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పోలీసులకు చిక్కారు. చెన్నైలో సూడో ఎపిడ్రిన్ డ్రగ్స్ తయారవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ రోడ్డు మార్గాన హైదరాబాద్కు చేరుకుంటుంది. బట్టలు, గాజులు, ఇతర వస్తువులలో ఈ డ్రగ్ పౌడర్ను ప్యాక్ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా కొరియర్ సంస్థలకు పంపిస్తున్నారు. జాతీయ స్థాయిలో కొనసాగే కొరియర్ సంస్థలను ఈ ముఠాలు ఎంచుకుంటున్నాయి. ఈ సంస్థల నుంచి నేరుగా అంతర్జాతీయ కొరియర్ సంస్థలు, ఆ తర్వాత ఎయిర్ కార్గోలకు ఎక్కడ కూడా అనుమానం రాకుండా వెళ్తున్నాయి. స్కానర్లు కూడా గుర్తుపట్టని విధంగా ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు.
వేర్వేరు ముఠాలు..
పార్సిల్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు వేర్వేరుగా ఉన్నాయి. తెలంగాణ పోలీసులకు చిక్కిన రెండు ముఠాల మూలాలు వేరుగా ఉన్నట్లు గుర్తించారు. హెచ్న్యూ పోలీసులు పట్టుకున్న ముఠాకు.. గతంలో రాచకొండ పోలీసులకు పట్టుబడ్డ ముఠాకు సంబంధాలు లేవని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రెండేండ్లుగా ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నది. అయినా, జాతీయ దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని గుర్తించలేకపోయాయి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని నిఘా సంస్థలు ఈ ముఠాలను పట్టుకుంటున్నాయి.