Hyderabad | బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచి పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
బెంగళూరులోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్ వద్ద పేలుడు ఘటన శుక్రవారం మధ్యాహ్నం కలకలం సృష్టించింది. ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మొదట గ్యాస్ సిలిండర్ పేలిందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. ఓ గుర్తు తెలియని వ్యక్తి కేఫ్లో ఉంచి వెళ్లిన బ్యాగులో పేలుడు సంభవించినట్లు కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. ఓ వ్యక్తి కేఫ్లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని తెలిపారు. ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కారణంగానే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు.