మియాపూర్, జూలై 28 : భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య పేర్కొన్నారు. ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు ఈ వేడుకలను అన్ని సర్కిళ్లలో ఘనంగా నిర్వహించాలని, షెడ్యూల్ వారీగా కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సహా వర్షాలు, రహదారుల మరమ్మతులు, ఇంచ్ బై ఇంచ్ ప్లాంటేషన్పై డీసీలు, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, యూబీడీ అధికారులతో జడ్సీ గురువారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ.. పక్షోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరణ, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, రంగోలి, పండ్ల పంపిణీ సహా పలు కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
ఐటీకి వేదికైన శేరిలింగంపల్లి జోన్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఐటీ కంపెనీలు, కార్పొరేట్, ప్రైవేట్ కార్యాలయాల్లో సైతం వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని శంకరయ్య కోరారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర వర్గాలందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ నెల 14న జోన్ వ్యాప్తంగా ఇంటింటికీ జాతీయ జెండా ఫ్లాగ్ల పంపిణీని నిర్వహించనున్నట్లు, జాతీయ జెండా నిర్వహణ నిబంధనలను అనుసరిస్తూ ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా రెపరెపలాడాలన్నారు. ప్రతీ ఒక్కరితో జాతీయతాభావం పెంపొందేలా వేడుకల నిర్వహణ కొనసాగాలని జడ్సీ తెలిపారు. జోన్ పరిధిలోని కీలకమైన ప్రాంతాలలో స్వాతంత్ర వజ్రోత్సవ ప్రాధాన్యత, జాతీయత భావంపై ఫొటో, లఘు చిత్రాల ప్రదర్శనలు నిర్వహించనున్నామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలని, నాలాల వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నాలాల వద్ద రక్షణ చర్యల పర్యవేక్షణకు నియమించిన నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యను గుర్తించినా తక్షణ మరమ్మతులకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జోన్ పరిధిలో ఇంచ్ బై ఇంచ్ మొక్కలు నాటే కార్యక్రమం 48 క్లస్టర్లలో విజయవంతంగా ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీలు వెంకన్న, నందగిరి సుధాంశ్, రమేశ్, బాలయ్య, ఎస్ఈ శంకర్, ఏజేసీ మల్లారెడ్డి, ఈఈలు, డీఈలు, ఏసీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.