సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బట్టల ఎగుమతి చాటున తమిళనాడు నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి రూ. 9 కోట్ల విలువైన 8.5 కిలోల సూడోఫెడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు. తమిళనాడుకు చెందిన మహ్మద్ ఖాసీం, రసూల్దీన్ తరచూ మలేషియా తదితర దేశాలకు వెళ్లి ఎలక్ట్రానిక్స్ గూడ్స్(స్మగుల్ గూడ్స్) తక్కువ ధరకు తెచ్చి విక్రయిస్తుంటారు. 2013లో రసూల్దీన్కు ఇబ్రహీం పరిచయమయ్యాడు. డ్రగ్స్తో కూడిన సూట్కేసును మలేషియాకు స్మగ్లింగ్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు.
దానిని మలేషియాకు తీసికెళ్తుండగా మధురై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులకు పట్టుకోవడంతో మూడు నెలలు జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడైన ఖాసీంతో పాటు ఫరీద్, ఫైజల్ను డ్రగ్స్ స్మగ్లింగ్లోకి దింపాడు. వీరంతా ఇతర దేశాలు తిరుగుతూ స్మగుల్ గూడ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. విదేశాల్లోని పలు ప్రాంతాలపై వీరికి అవగాహన ఉండటంతో చెన్నైలో సుడో ఎఫిడ్రిన్ సింథటిక్ డ్రగ్స్ను తయారు చేసి, వాటిని బట్టలు, గాజులు, పిల్లల గిఫ్టు ప్యాక్ల్లో, పాకెట్లలో ప్రత్యేకంగా భద్రపరుస్తున్నారు. ఆ పాకెట్లను కవర్లలో దాచిపెట్టి ఎవరూ గుర్తుపట్టకుండా వాటిని తయారు చేస్తారు. ఇలా బాక్స్ల్లో నింపిన డ్రగ్స్ను హైదరాబాద్లోని జీవీఆర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్, పుణెలోని ఇండోఫైన్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు ఎయిర్ మార్గంలో పంపించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఎనిమిదిసార్లు, పుణె నుంచి ఏడుసార్లు 70 కిలోల సూడో ఎఫిడ్రిన్ను ఈ ఏడాది ఎగుమతి చేశాడు.
చెన్నై నుంచి బస్సులో..
నాలుగు రోజుల కిందట చెన్నైలో రహీం ద్వారా సింథటిక్ డ్రగ్స్ను అందుకున్న ఖాసీం, రసూలు దీన్ బస్సులో వివిధ కంపెనీలకు చెందిన బట్టలు లుంగీలు, పంచెలు, షర్ట్స్తో కూడిన పాకెట్లతో హైదరాబాద్కు వచ్చారు. నాచారం ప్రాంతంలో ఒక లాడ్జిలో దిగారు. లాడ్జి గదిలో తమతో తెచ్చుకున్న రామరాజ్ కాటన్ బట్టలకు సంబంధించిన పాకెట్స్ పైనా, కింద ఒక పొరను తొలగించి, అందులో డ్రగ్స్ను నింపుతున్నారు. ఇలా ప్యాక్ చేసిన కాటన్ బాక్స్లను సాధారణ బట్టల ఎగుమతి మాదిరిగా ఈసీఐఎల్ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ ద్వారా పంపించేందుకు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ నేతృత్వంలో మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాములు, నాచారం పోలీసులు సంయుక్తంగా దాడిచేసి ఖాసీం, రసూలు దీన్ను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి నుంచి 8.5 కిలోల సింథటిక్ డ్రగ్స్తో పాటు రూ. 4,02,500 నగదు, ఐదు పాస్పోర్టులు, మూడు ఆధార్ కార్డులు, డ్రగ్స్ తూకం వేసే యంత్రం, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ దందాకు సంబంధించిన ఫరీద్, ఫైజల్, రహీమ్ పరారీలో ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు.. దీని వెనక ఎవరున్నారు.. అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఓటీ పోలీసులను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ సుధీర్బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.