Asaduddin Owaisi | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మహమూద్ అస్ఫాన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 12 మంది లేబర్ పని కోసం గత ఏడాది గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత సెక్యూరిటీ లేబర్గా పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుందని స్థానిక ఏజెంట్లు ఆశ చూపి రష్యాకు పంపించారు. అక్కడ రష్యన్ ఆర్మీలో సెక్యూరిటీ లేబర్గా పనిచేయించుకున్నారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన రష్యన్ ఆర్మీతో కలిసి వారు ఉక్రెయిన్లోకి వెళ్లారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే తమ బిడ్డ ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విషయాన్ని నాంపల్లికి చెందిన అస్ఫాన్ కుటుంబసభ్యులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకెళ్లారు. వారిని వెనక్కి తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలోనే స్పందించిన ఒవైసీ.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 12 మంది భారతీయులను తిరిగి ఇండియాకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాగా, ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 12 మంది భారతీయుల్లో తెలంగాణతో పాటు కర్ణాటక, గుజరాత్, యూపీ, జమ్ము కశ్మీర్కు చెందిన వారు ఉన్నారు.