Hyd Metro | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. 70 కిలోమీటరల్ కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదించారు. ఫేజ్-2 విస్తరణలో భాగంగా చాంద్రయాణగుట్ట క్రాస్రోడ్డు వరకు పొడిగించారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ ఉన్న రెండో కారిడార్ చాంద్రయాణగుట్ట వరకు పొడిగిస్తూ ప్రతిపాదించారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కారిడార్-2లో ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నుమా నుంచి చాంద్రయాణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 29 కిలోమీటర్లు వేయాలని సూచించారు. నాగోల్, ఎల్బీనగర్, చాంద్రయాణగుట్ట, మైలార్దేవ్పల్లి నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వెళ్లేలా ప్రతిపాదించారు. ఇదే కారిడార్-4లో మైలార్దేవ్పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు, కారియర్-5లో రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు.. రాయదుర్గం, నానక్రామ్గూడ, విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో వేయాలని ప్రతిపాదించారు.
కారిడార్-6లో మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 14 కిలోమీటర్లు ప్రతిపాదించారు. మియాపూర్, పటాన్చెరు, బీహెచ్ఈఎల్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో లైన్ వేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. కారిడార్-7లో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు 8 కిలోమీటర్ల వరకు.. ఎల్బీనగర్, వనస్థలీపురం, హయత్నగర్ వరకు మెట్రో వెళ్లేలా ప్రతిపాదనలు చేశారు.