వెంగళరావునగర్, జూలై 18 : అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తల్లిని అంతం చేసిన కుమారుడికి న్యాయస్థానం జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. బల్కంపేట నివాసి సంగీత (50)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సంగీత భర్త వీరన్న కరోనాతో మరణించాడు. సంగీత మూడో కుమారుడు బేకనంద సంతు అలియాస్ బంజల్ సంతోష్ (22) ఏ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. గంజాయికి అలవాటుపడ్డాడు. గంజాయి మత్తులో తరచూ ఉన్మాదిలా ప్రవర్తించే సంతోష్.. ఇంటిలో కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో 2021, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం సోదరులిద్దరూ బయటకు వెళ్లారు.
సంగీత చిన్న కూతురు మహేశ్వరి, ఆమె వదినతో కలిసి బయటకు వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లి సంగీతతో గంజాయి కోసం డబ్బు ఇవ్వాలంటూ గొడవపడ్డాడు. డబ్బులిచ్చేందుకు తల్లి నిరాకరించడంతో కోపంతో ఉన్మాదిలా మారిన సంతోష్ కత్తితో తల్లి పొత్తికడుపులో పలుమార్లు పొడిచాడు. పొట్టలో నుంచి ఆమె పేగులు బయటకు తీశాడు. సంగీత కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ఇంట్లో నుంచి పెద్ద కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఇంటి తలుపు తట్టారు. అయితే, తల్లిని కత్తితో పొడిచి హత్య చేసిన సంతోష్ లోపలి నుంచి గడియపెట్టుకున్నాడు. తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించి నిందితుడు సంతోష్ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న 15 మంది సాక్షులను విచారించారు.
తగిన ఆధారాలతో ఇన్స్పెక్టర్ సైదులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి డి.రమాకాంత్ మంగళవారం నిందితుడు సంతోష్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరునెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించారు.