సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీని కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి. నగరంలోని దుర్గంచెరువు, ముల్లకత్వచెరువు, రెయిన్బో విస్టా, ఫతేనగర్, హైదరాబాద్ పబ్లిక్ సూల్ తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) జలమండలి ఎండీ దానకిశోర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గంచెరువు ఎస్టీపీ (7 ఎంఎల్డీ సామర్థ్యం) వందశాతం పనులు పూర్తి చేసుకుందని తెలిపారు. 20 రోజులుగా ట్రయల్ రన్స్ కూడా జరుపుతున్నామని అన్నారు. మిగతా ఎస్టీపీల నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నట్లు వెల్లడించారు. చాలా ఎస్టీపీల్లో సివిల్ పనులు పూర్తయినట్లు పేరొన్నారు. మరికొన్ని వాటిల్లో ఎలక్ట్రో మాగ్నటిక్ పరికరాలు అమర్చడం, ఇతర సామగ్రి, యంత్రాలు, ఇన్లెట్, అవుట్ లెట్ పనులు జరుగుతున్నట్లు, వాటిని పూర్తిచేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
నివాసాల సమీపంలో ఉన్న ఎస్టీపీల చుట్టూ నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలనే మంత్రి కేటీఆర్ సూచనలతో వాటి నుంచి దుర్వాసన రాకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం విదేశీ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎస్టీపీల నుంచి వెలువడే వ్యర్థాలను సేంద్రియ ఎరువుల తయారీలో ఉపయోగించే అవకాశం ఉన్నందున ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికి ఎస్టీపీల్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో గార్డెనింగ్, వాకింగ్ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేరొన్నారు. అలాగే నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మహానగరంలో 100శాతం మురుగు నీటి శుద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ విజన్, పురపాలక మంత్రి కేటీఆర్ సారథ్యంలో జలమండలి ఆధ్వర్యంలో మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో 31ఎస్టీపీలను నిర్మిస్తున్నది.
ప్రస్తుతం వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతున్నది. జీహెచ్ఎంసీ ఏరియాలో రోజూ 1650 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతున్నది. ఈ పరిధిలో ప్రస్తుతం ఉన్న 25 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా 772మిలియన్ గ్యాలన్లు మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. మిగతా 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో కొత్తగా 31ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది. 2036 సంవత్సరం వరకు రాబోయే కాలంలో ఉత్పత్తయ్యే మురుగును శుద్ధి చేసేందుకు వీటిని నిర్మిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని ఎస్టీపీలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్బాబు, ఎస్టీపీ సీజీఎం, జీఎంలు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.