హైదరాబాద్: హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీతోపాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందుతున్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజీతో మ్యాన్ హొళ్లలో పూడిక తొలగింపు జరుగుతున్నదని తెలిపారు. 2014కు ముందు తాగునీటి కోసం హైదరాబాద్లో నిత్యం ఆందోళనలు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని చెప్పారు. అప్పటి జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేసిన డ్రైనేజి, త్రాగునీటి వ్యవస్థ కారణంగానే కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు.