Hyderabad | హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి ఉదయం వరకు రూ. 47 లక్షలు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. రూ. 17 లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 104.41 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు.
మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు నిర్వహించి, రూ. 29,70,000 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. రూ. 23 వేల విలువైన వస్తువులు, 50 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రూ. 38 లక్షల నగదును సీజ్ చేయగా, పోలీసులు రూ. 9.18 లక్షల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నగదు రవాణాకు సంబంధించి 26 ఫిర్యాదులు అందగా, 19 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.