సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి: ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగే క్రిస్మస్ విందు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, స్టీఫెన్సన్, ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, సురభివాణిదేవి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా జరుపుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ విందులో దాదాపు 12వేల మంది పాల్గొంటారని మంత్రి కొప్పుల వివరించారు. ఈ వేడుకలు గొప్పగా జరపాలని, ప్రతి ఒక్కరూ సాయంత్రం 5 గంటకల్లా చేరుకోవాలని సూచించారు. విందుతో పాటు కొంత మందికి అవార్డులు అందజేయనున్నట్లు మంత్రి కొప్పుల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, శంకర్లూక్, రాయడన్ రోస్, విద్యాస్రవంతి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బిషప్కు ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు హజరు కావాలని మంగళవారం హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్, కార్డినల్ పూల ఆంథోనీని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని బిషప్ హౌజ్లో పూల ఆంథోనీని మంత్రి కలిసి ఆహ్వానించారు. అదేవిధంగా సీఎస్ఐ మెదక్ డయాసిస్ మోడరేటరీ కమిషనరీ పద్మారావును కూడ మంత్రి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఇమ్మానుయిల్, విక్టర్, ఇన్నారెడ్డి, పాస్టర్ భాస్కర్, నాయకులు బాస కృపానందం, తలసాని సాయి కిరణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగే క్రిస్మస్ విందు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వారిని నాంపల్లి, చాపల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
అబిడ్స్, గన్ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్ఫౌండ్రీ నుంచి చాపల్రోడ్డు,స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
బషీర్బాగ్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు రూట్లో వచ్చే వాహనాలను కింగ్ కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డులోకి పంపిస్తారు.
సుజాత స్కూల్ లైన్ నుంచి ఖాన్ లతీఫ్ఖాన్ బిల్డింగ్ వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా ఆయా ప్రాంతాలకు మళ్లిస్తారు.
ఈ జంక్షన్ల వైపు వెళ్లొద్దు..
మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్ కంట్రోల్ రూం, బషీర్బాగ్, బీజేఆర్ విగ్రహం సర్కిల్, ఎస్బీఐ గన్ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి, కేఎల్కే బిల్డింగ్, లిబర్టీ, రవీంద్ర భారతి, లక్డీకపూల్, ఇక్బాల్ మినార్, హిమాయత్నగర్, అసెంబ్లీ, ఎం.జే.మార్కెట్, హైదర్గూడ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ జంక్షన్ల నుంచి రాకపోకలు సాగించకపోవడం మంచిదని అదనపు సీపీ తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సులను రవీంద్రభారతి నుంచి అబిడ్స్ వైపు కాకుండా.. ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా వెళ్లాలి. పార్కింగ్ స్థలాలను అందుబాటులో ఉంచామని, ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారు వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు.