సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్లు తీసుకున్న చొరవే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) 10వ వార్షిక వేడుకల్లో భాగంగా టీ హబ్లో నిర్వహించిన టీటా గ్లోబల్ కనెక్ట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతో పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుందన్నారు. ముఖ్యంగా ఐటీ రంగంతో పాటు వ్యవసాయ రంగంలో దేశంలోనే చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు వచ్చాయన్నారు. టీటా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీ రంగంలో మనమేంటో నిరూపించుకునే అవకాశాన్ని చూపిస్తున్నారు.ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు.