మణికొండ, డిసెంబర్ 9 : దేశానికి దిక్సూచి సీఎం కేసీఆరేనని ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం తామంతా అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం మెట్రో రైలు రెండో దశ పనుల ప్రారంభోత్సవానికి గచ్చిబౌలి విచ్చేసిన సీఎం కేసీఆర్ బండ్లగూడలోని తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చాలా రోజుల తర్వాత వచ్చిన సీఎం సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఎనిమిదేండ్లల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధికి నాందిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఆనాడు పార్టీ మారిన సమయంలో తమ నియోజకవర్గానికి శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరిన ఆరునెలలకే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని అన్నారు.
ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు పెరుగుతున్న జనాభాకనుగుణంగా చర్యలు చేపడుతున్న ఘనత మంత్రి కేటీఆర్కే దక్కిందన్నారు. శివారు ప్రాంతానికి మరో మైలురాయిగా అద్భుతమైన మెట్రో రైలును ఎయిర్పోర్టు వరకు తీసుకురావడం చారిత్రాత్మకం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్నివర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తూ సుపరిపాలనను అందిస్తున్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్ మండలంలోని పలు గ్రామాలతో పాటు మణికొండలోనూ అర్హులైన పేద ప్రజలకు ఇళ్లపట్టాలను కేటాయించేందుకు ఆదేశాలను జారీ చేయాలని సీఎంను కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్ అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఎంపీ రంజిత్రెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.