హిమాయత్నగర్, నవంబర్ 22: ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన దంపతులతో పాటు మరో మహిళను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల విలువజేసే బంగారు బిస్కెట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. మంగళవారం నారాయణగూడ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ సునీతారెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. హైదర్గూడ నివాసి వరుణ్ జోషి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాదాపు రూ. 36లక్షల విలువైన 81 తులాల బంగారు బిస్కెట్లు, ఆభరణాలను స్టీల్ బాక్స్లో పెట్టి ఇంటిలోని స్టోర్ రూంలో భద్రపరిచాడు. వరుణ్జోషి కవాడిగూడలో నూతనంగా ఇల్లు నిర్మించాడు. అక్కడికి వెళ్లేముందు ఇంట్లో ఉన్న సామగ్రిని సర్దుతుండగా.. బంగారు బిస్కెట్లు, ఆభరణాలు దాచిన బాక్స్ కనిపించలేదు. పని మనిషి కూడా పనులకు రావడంలేదు.
ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పని మనిషి రాధపై అనుమానం వ్యక్తం చేస్తూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పని మనిషి రాధ గూర్చి ఆరా తీశారు. నాలుగు రోజులుగా రాధ పనికి రావడంలేదని గుర్తించారు. ఆమె కాల్ డేటా, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈనెల 19వ తేదీన నేరం చేసినట్టు ఆమె ఒప్పుకుంది. ఈ చోరీకి భర్త సురేశ్, తల్లి శోభ సహకరించినట్లు తెలిపింది. పోలీసులు రాధతోపాటు ఆమె భర్త సురేశ్, తల్లి శోభను అరెస్టు చేశారు. 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించిన నారాయణగూడ క్రైం టీమ్ను ఈ సందర్భంగా ఇన్చార్జి డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ ఎ.రమణారెడ్డి, అబిడ్స్ ఏసీపీ వెంకట్రెడ్డి, నారాయణగూడ పీఎస్ సీఐ శ్రీనివాస్రెడ్డి, డీఐ భాస్కర్, డీఎస్సై జి.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.