సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మండపాల నిర్వాహకులు, కమ్యూనిటీ సభ్యులతో సమన్వయం చేస్తూ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతు సహకారాన్ని అందించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఆర్అండ్బీ, విద్యుత్, అగ్నిమాపక, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులతో పాటు గణేశ్ ఉత్సవ సమితి సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ గణేశ్ నవరాత్రి వేడుకలు ఆగస్టు 31న ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ 9న సామూహిక గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది 8 నెలలుగా అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజల సహకారంతో అన్ని పండుగలను ప్రశాంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో గణేశ్ వేడుకలు కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నిమజ్జన ఏర్పాట్లు, మండల ఏర్పాట్లపై పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వాలని, అలాగే గణేశ్ మండలపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారని వాటిని పరిస్కరించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. నిమజ్జన ఊరేగింపు జరిగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, ఇతర పనులు జరుగుతున్నాయని, నిమజ్జనానికి తగిన క్రేన్లను అందుబాటులో ఉంచుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. రవాణా శాఖ నుంచి 14 నిమజ్జన కేంద్రాల వద్ద కావాల్సిన వాహనాలను అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యుత్, ఇతర శాఖలు తమ విభాగాల నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
చవితి నుంచి నిమజ్జనం వరకు అవాంతరాలు లేకుండా..
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు కసరత్తు మొదలు పెట్టారు. గురువారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ఆడిటోరియంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన అన్ని మతాల పండుగలు, వేడుకలు శాంతియుతంగా జరిగాయని, అదే తరహాలో గణేశ్ నవరాత్రులను నిర్వహించాలని సూచించారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా సైబరాబాద్ పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఆర్అండ్బీ, ట్రాన్స్కో, ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ, తదితర అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక ప్రజలు, మీడియా, వినాయక మండపాల నిర్వాహకులతో కలిసి సమన్వయం చేసుకుంటూ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునేలా కృషి చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే సోషల్ మీడియాపై చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.