హైదరాబాద్ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అమెరికాతో పోటీ పడుతుందని, నగరంలో మంచినీటి సమస్య లేనే లేదని తేల్చిచెప్పారు. శాసనసభలో పట్టణ ప్రగతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నగర అభివృద్ధి తమ ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి తలసాని తప్పుబట్టారు.
గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ లీడర్కు గతి లేకుండా పోయింది అని తలసాని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో ఏం జరిగిందో ఈ ప్రపంచమంతా చూస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఒక నూతనమైన ఒరవడిలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, స్టీలు బ్రిడ్జిలు, లింక్ రోడ్లును అభివృద్ధి చేశారు. ఎస్ఆర్డీపీ కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నాలాలను అభివృద్ధి చేశారు. కరెంట్, మంచినీటి విషయంలో హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు లేవు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి కష్టాలుండేవి. ఎల్ఈడీ లైట్లు, పార్కులు, ఫుట్పాత్లను అభివృద్ధి చేశాం. హైదరాబాద్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్కు వచ్చి సెటిలవుతున్నారు. ప్రతిపక్షాలు బాధ్యాతయుతంగా వ్యవహరించాలి. దేశ, విదేశాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు లేవు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికి మంచినీటిని అందిస్తున్నారు. నగరంలో వైకుంఠధామాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చింది. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెసోళ్లకు ఎందుకు ఇష్టం ఉండదు. బడుగు, బలహీన వర్గాల కోసం హైదరాబాద్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.