గత ఐదారు రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్కు పూర్తిస్థాయి నీటిమట్టం కంటే అధికంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. సాగర్ ప్రస్తుతం నీటిమట్టం 513.41 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 అడుగులు. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో.. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు కూడా వరద పోటెత్తింది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 894 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఐదారు రోజుల నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులకు నీటితో కళకళలాడుతున్నాయి.