మెహిదీపట్నం, నవంబర్ 16: అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బుధవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ.శివమారుతి, ఆసిఫ్నగర్ ఇన్స్పెక్టర్ చెరువుపల్లి శ్రీనివాస్తో కలిసి డీసీపీ వివరాలను వెల్లడించారు. సంగారెడ్డికి చెందిన షానూర్ బేగం (28)వివాహం 2011లో జిర్రా ప్రాంతానికి చెందిన ఎండి. నవాజ్తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. మూడేండ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం భర్త నవాజ్, అత్త మహ్మద్ రజియా బేగం, మామ మహ్మద్ ఇబ్రహీం, ఇంటి ఎదురుగా ఉండే మహ్మద్ రైసా వేధించడం మొదలు పెట్టారు. 2014, డిసెంబర్ 4వ తేదీన షానూర్ తన ఇద్దరు పిల్లలతో సహా అనుమానాస్పద స్థితిలో ఇంటిలోని సంపులో పడి చనిపోయింది.
తమ కూతురు, ఆమె పిల్లల మృతికి నవాజ్ కుటుంబ సభ్యులే కారణమంటూ షానూర్ పుట్టింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షానూర్, ఆమె పిల్లలను భర్త, అత్తామామ, ఇంటికి ఎదురుగా నివసించే మహిళ పథకం ప్రకారం చంపి సంపులో పడేసినట్లు గుర్తించారు. ఆమేరకు కోర్టులో అన్ని ఆధారాలతో చార్జ్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నాంపల్లి నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి హేమంత్కుమార్ బుధవారం నిందితులకు వరకట్నం, హత్య నేరాల కింద యావజ్జీవ కారాగార శిక్ష, రూ.4వేలు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చారు. కేసును పీపీ సాంబశివ రెడ్డి, అసిస్టెంట్ పీపీ కె.శివాని వాదించారు. ఈ కేసులో నిందితులకు జైలు శిక్ష పడేలా పనిచేసిన పోలీసులను ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.