కరీంనగర్ ప్రతినిధి, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల గడ్డపై జనం ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అశేషంగా ప్రజానీకం తరలివచ్చింది. చిన్నా పెద్ద అన్నతేడా లేకుండా లక్షలాదిగా కదలిరావడంతో జగిత్యాల జైత్రయాత్రను తలపించింది. ఎటుచూసినా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. జగిత్యాల నలువైపులా దారులు జనసంద్రంలా మారాయి. దాదాపు 20 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. కొత్త జిల్లా ఏర్పాటుతోపాటు మెడికల్ కాలేజీ, నూతన కలెక్టరేట్ వంటి ఎన్నో హంగులను సమకూర్చిన సీఎం కేసీఆర్, సభికుల కరతాళ ధ్వనుల మధ్య వేదికపై గంభీర ప్రసంగం చేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత చేసిన అభివృద్ధిని చెబుతూనే.. బీజేపీ, కాంగ్రెస్ కపట రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా లేదా అంటూ ప్రశ్నించగా, పిడికిలి బిగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనంటూ సభికులు ఆశీర్వదించారు. దేశం బాగు కోసం, జాగృతి కోసం కేసీఆర్ నడుం బిగించాల్సిందేనంటూ ముక్తకంఠంతో కోరారు.
కొండగట్టుకు రూ.100కోట్లు
తెలంగాణ ఒక ఆధ్యాత్మిక పరిమళాలు ఉన్న ప్రాంతం. ఇక్కడ అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాళేశ్వరం, వేములవాడ, ధర్మపురి నర్సింహస్వామి, ఇంకా మహిమాన్విత క్షేత్రం కొండగట్టు ఉంది. ఇక్కడ హనుమాన్ భక్తులు వేలు.. పోయి లక్షలు అవుతున్నరు. కొండగట్టు అంజన్న ఆలయానికి కేవలం 20 ఎకరాల స్థలం మాత్రమే ఉండేది. పక్కనే ఉన్న 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవస్థానానికే ఇచ్చినం. అంటే అంజన్న సన్నిధిలో ఈ రోజు 404 ఎకరాల భూమి దేవస్థానానికి ఉంది. నేను ఒక్కటే మాట చెబుతున్నా ఈ కొండగట్టు క్షేత్రానికి ఈ రోజు ఈ వేదిక నుంచి రూ.100కోట్లు మంజూరు చేస్తున్న. త్వరలోనే స్వయంగా నేనే స్థపతులను తీసుకొచ్చి ఆగమశాస్త్రం ప్రకారం దేశంలోనే అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తా. దీక్షాపరులు మాల విరమణ చేసుకునేలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్త
– ముఖ్యమంత్రి కేసీఆర్
మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రులు ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్
కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం కలెక్టర్ రవిని అభినందిస్తున్న సీఎం కేసీఆర్