Hyderabad | పేదల సొంతింటి పండుగకు నగరం మరోసారి ముస్తాబైంది. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి బల్దియా సర్వం సిద్ధం చేసింది. పైసా ఖర్చు లేకుండా, పూర్తి పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులను అధికారులు ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగించి ఎంపిక చేశారు. రెండో విడతలో భాగంగా గురువారం మొత్తం 13,300 మంది గృహ ప్రవేశాలు చేయనున్నారు. పండుగ వాతావరణంలో 9 ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితారెడ్డి, మల్లారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేయనున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ) : అర్హులైన పేదవారికి డబుల్ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి బల్దియా ఏర్పాట్లు చేయగా… పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. తొలి విడతలో 11,700 ఇండ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగా… రెండో విడతలో 13,300 లబ్ధిదారుల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేయనుంది. రూ. 50 లక్షలు విలువ చేసే సొంతింటిని నయా పైసా ఖర్చు లేకుండా సీఎం కేసీఆర్ పేదోడికి అందిస్తున్నారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటివరకు 70వేల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయగా…మరో 30వేల ఇండ్లు పలు దశల్లో ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్లపై సాగుతున్న రాజకీయాలకు చెక్ పెడుతూ దశల వారీగా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 9 నియోజకవర్గాల పరిధిలో రెండోసారి ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్లను పట్టాలను అందించనున్నారు. ర్యాండమైజేషన్ విధానంలో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపులు చేయనున్నారు.
నేడు జరిగే ఇండ్ల కేటాయింపు పూర్తి స్థాయిలో సాంకేతికతతోనే జరుగుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బల్దియా, టెక్నీషియన్ల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా… ప్రభుత్వం రూపొందించిన రిజర్వేషన్ల ప్రకారమే ఇండ్ల పంపిణీ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతోపాటు, ఫ్లోర్స్ కేటాయింపులోనూ దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ క్రమంలో వారికి గ్రౌండ్, మొదటి అంతస్తులో ఇళ్లను కేటాయించే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన డ్రైరన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను బల్దియా, జిల్లా యంత్రాంగం నిర్వహించింది. రెండో విడత ఇండ్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 9 నియోజకవర్గాల వారీగా ఇండ్ల పట్టాల పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో ఇండ్లను పంపిణీ చేసేందుకు మంత్రి కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. దుండిగల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని బల్దియా వర్గాలు వెల్లడించాయి. 2100 మంది లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్యక్రమమంలో పాల్గొని ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.