మలక్పేట, జూన్ 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలతో వ్యవసాయ రంగం లాభసాటిగా మారిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మలక్పేట మహబూబ్ మ్యాన్షన్లోని మార్కెట్లో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి రాష్ర్టాన్ని దేశానికే అన్నపూర్ణగా మార్చారని అన్నారు.
రైతుబంధు పథకం ఐక్యరాజ్య సమితి మన్ననలు పొందిందని పేర్కొన్నారు. రైతును రాజును చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నేడు కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. తెలంగాణ పథకాలను చూసి మహారాష్ట్ర ప్రజలు తమ ఊర్లను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో, దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడనుందని, ఇందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ర్టానికి చెందిన రైతులతోపాటు మహారాష్ట్రకు చెందిన పలువురు రైతులను, వ్యాపారులను, కొనుగోలుదారులను, కమీషన్ ఏజెంట్లను, పోలీసు అధికారులను ఘనంగా సన్మానించారు. మార్కెట్లో దొంగతనాలు జరుగుతున్నాయని, ఇక్కడ ఔట్ పోస్టును ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరగా, వెంటనే స్పందించిన మంత్రి డీసీపీతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మంత్రి మహమూద్ అలీ, చైర్ పర్సన్ అనితా నాయక్, వైస్ చైర్మన్ భూమేశ్వర్, మార్కెట్ ఉప సంచాలకులు దామోదర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బలాల, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితా నాయక్, వైస్ చైర్మన్ భూమేశ్వర్, డైరెక్టర్లు లలితాబాయి, మైల రవికాంత్, బట్టిరి విద్యానంద్, రాము యాదవ్, రాహుల్, యాదగిరి, మాణిక్రావు, ఎజాజ్, సల్మాన్ మహ్మద్ఖాన్, మార్కెట్ ఉప సంచాలకులు ఎం.దామోదర్, గ్రేడ్-3 కార్యదర్శి రవీందర్రెడ్డి, డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీ, వ్యాపారులు దేవర రాజేశ్వర్, చేగూరి వెంకటరమణ, కట్టా మల్లేశం, దుగ్గు జగదీశ్కుమార్, రాఘవేందర్, దేవత అశోక్, ప్రమోద్, కృష్ణ, టి.అనిల్, వి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.