Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ శివారుల్లోని బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల్లిలో 85 ప్లాట్లకు వచ్చే నెల 22 నుంచి 25 వరకు ఆన్లైన్లో వేలం నిర్వహించనున్నారు.
నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లిలో 27 ఎకరాలు, మేడిపల్లిలో 55 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసింది. మార్చిలో మొదటి విడత కింద కొన్ని ప్లాట్లను విక్రయించగా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా రెండో విడత కింద రెండు లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ను జారీ చేసింది. బాచుపల్లిలో చదరపు గజానికి రూ.25 వేలు, మేడిపల్లిలో రూ.32 వేలు చొప్పున హెచ్ఎండీఏ ధర నిర్ణయించింది. కనీస బిడ్ పెంపుదల చదరపు గజానికి రూ.500 చొప్పున ఉండాలని నోటిఫికేషన్లో సూచించింది. మరింత సమాచారం కోసం హెచ్ఎండీఏ వెబ్సైట్, ఎంఎస్టీసీ ఈ-కామర్స్, ఎంఎస్టీసీ ఇండియా వెబ్సైట్లను సంప్రదించాలని తెలిపింది. లేఅవుట్ల సందర్శనకు, సందేహాల నివృత్తి కోసం ఫోన్ నంబర్లు: 7396345623, 9154843213లో సంప్రదించాలని అధికారులు తెలిపారు.