Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ శివారు ప్రాంతాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ను కల్పించేందుకు హెచ్ఎండీఏ రోడ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా నగరానికి ఉత్తర- పడమర నగరాలను కలిపేలా రోడ్ల విస్తరణ చేపట్టాలని, అవసరమైన చోట ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ ఒకేసారి మూడు పనులను చేపట్టింది. బాచుపల్లి నుంచి బౌరంపేట వరకు 4 వరుసలతో రోడ్డు విస్తరణ, బాచుపల్లి జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణం, బహదూర్పల్లి- కొంపల్లి మార్గంలో 4 వరుసలతో రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నాయి. ఏక కాలంలో ఈ పనులన్నింటినీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. నిధుల కొరత లేకపోవడంతో నిర్ణయించిన రోడ్లు, ఫ్లై ఓవర్ నిర్మాణం పనులను నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేలా క్షేత్ర స్థాయిలో హెచ్ఎండీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సుమారు రూ.173.42 కోట్ల వ్యయంతో ఈ పనులను హెచ్ఎండీఏ నిర్వహిస్తోంది.
గ్రేటర్ శివారు మున్సిపాలిటీలు నిజాంపేట, దుండిగల్, కొంపల్లి ప్రాంతాల్లో పట్టణీకరణతో పాటు పరిశ్రమలు పెరిగాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని హెచ్ఎండీఏ శివారు ప్రాంతాలైన బాచుపల్లి-కొంపల్లి ప్రాంతాలను కలుపుతూ 100 అడుగుల విస్తీర్ణంతో కూడిన రహదారిని అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా బాచుపల్లి జంక్షన్ నుంచి బౌరంపేట వరకు 4 వరుసలతో కూడిన 6 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.66.20 కోట్లు, బహదూర్పల్లి నుంచి కొంపల్లి రోడ్ వరకు ప్రస్తుతం ఉన్న 7 కి.మీ రోడ్డును వెడల్పు చేయడంతో పాటు పటిష్టం చేసేందుకు రూ.25 కోట్లు, బాచుపల్లి జంక్షన్ వద్ద 4 వరుసలతో ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.82.22 కోట్లు కేటాయించింది. గతేడాది ఏప్రిల్లో టెండర్లు పిలిచి హెచ్ఎండీఏ పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులు ఇప్పటి వరకు 15 శాతం పూర్తయ్యాయని హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో ఒకవైపే విస్తరిస్తున్న ఐటీ రంగాన్ని నగరం నలుమూలలా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రిడ్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో రోడ్ల నెట్వర్క్ను మెరుగ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ శాఖలకు సూచించింది. శివారు ప్రాంతాలను కలుపుతూ రోడ్లను అభివృద్ధి చేస్తే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. అదే సమయంలో ఉద్యోగుల రాకపోకలు సులభమవుతాయి. గతేడాది మేడ్చల్ కండ్లకోయ వద్ద ప్రభుత్వం ఐటీ పార్కు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. దీంతో నగరానికి ఉత్తర దిక్కున ఉన్న మేడ్చల్ ప్రాంతంతో అనుసంధానం అయ్యేలా కొంపల్లి నుంచి బహదూర్పల్లి, అక్కడి నుంచి బాచుపల్లి, బౌరంపేట, మల్లాపూర్ ఔటర్ రింగు రోడ్డు వరకు 100 అడుగులతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ మార్గంలో కీలకమైన బాచుపల్లి జంక్షన్లో 4 వరుసలతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఈ జంక్షన్లో ఒకవైపు మియాపూర్, గండిమైసమ్మ ప్రాంతాలను కలుపుతుండగా… మరో వైపు బౌరంపేట, మల్లాపూర్, కొంపల్లి వైపు రోడ్లను కలుపుతుంది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యం అందుబాటులోకి రానుంది.