సిటీబ్యూరో, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): ఇంటి అనుమతుల్లో ఎక్కడ జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా టీఎస్-బీపాస్ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆన్లైన్లో అనుమతి పొందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా సాప్ట్వేర్ను రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రణాళికా విభాగం అధికారులు పనిచేస్తూ నిర్ణీత సమయంలో ఇండ్ల నిర్మాణ అనుమతులు ఇవ్వాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ విభా గం ఉన్నతాధికారులు ఆదేశించారు. మంగళవారం అమీర్పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ప్రణాళికా విభాగంలోని జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్స్(జేపీఓ), అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్(ఏపీఓ)ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జోన్ల వారీగా ఉన్న ప్లానింగ్ ఆఫీసర్ (పీఓ)లు ఏం చేస్తున్నారని, అనుమతుల జారీలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలతో పాటు జరిమానా…
జీహెచ్ఎంసీ తర్వాత గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పట్టణీకరణతో పాటు ఇండ్ల నిర్మాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని 4 జోన్లలోనూ వ్యక్తిగత ఇండ్లతో పాటు అపార్టుమెంట్లు, ఇతర హౌసింగ్ ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రణాళికా విభాగం అధికారులు నిర్లక్ష్యం చేయకుండా దరఖాస్తులను పరిశీలించి అనుమతులివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గత 3,4 నెలలుగా పెండింగ్లో ఉన్న ఫైళ్లపై జోన్ల వారీగా ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు సమీక్ష చేశారు. టీఎస్- బీపాస్ నిబంధనల ప్రకారం అనుమతుల్లో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని, ఇప్పటికే పలువురు ప్రణాళికా విభాగం అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించామని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా విధులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను హెచ్చరించారు.