హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురు పట్టిన నగరంలో.. రాత్రి 8 గంటల సమయంలో కుండపోత వాన పడింది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం చేస్తున్నాయి.
అయితే రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజుల్లో హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తెలంగాణలోని 14 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. అవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని చెప్పింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని జలాశయాలకు జలకళ వచ్చింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైతులు కూడా పొలాల బాట పట్టి, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు.