హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, నాచారం, సికింద్రాబాద్, ముషీరాబాద్, లక్డీకాపూల్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, మెహిదీపట్నం, కొండాపూర్, బాలానగర్, జీడిమెట్ల, దుండిగల్ ఏరియాల్లో వాన దంచికొడుతోంది. కుత్బుల్లాపూర్, చింతల్, కొంపల్లి, సుచిత్రలో కుండపోత వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, మల్కాజ్గిరిలో జోరు వాన పడుతోంది. కాప్రా, కుషాయిగూడ, అల్వాల్, నాగారం, దమ్మాయిగూడతో పాటు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.
భారీ వర్షానికి నగరంలోని పలు నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.