సివిల్.. ట్రాఫిక్ పోలీస్.. జీహెచ్ఎంసీ.. జలమండలి.. హైడ్రా ఫెయిలయ్యాయి. పావుగంట తొలకరికే గ్రేటర్ వణికిపోయింది.. ముందస్తు చర్యల్లో లోపాలతో పాటు కనీసం చినుకుపడినప్పుడు అప్రమత్తం కావాల్సిన వ్యవస్థలు చేతులెత్తేశాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో నగరంలో రహదారులు గోదారులయ్యాయి. నగరవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. కూలిన చెట్లు, తెగిపడిన వైర్లు, నేలకొరిగిన స్తంభాలతో పాటు చారిత్రక కట్టడాలైన నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. కనీసం ట్రాఫిక్ను నియంత్రించే దిక్కు లేకపోవడంతో రోడ్లన్నీ జలమయమై గంటల తరబడి వాహనదారులు ఆగిపోయారు. రోడ్లపైనే తడుస్తూ కనీసం ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు
– సిటీ బ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్ను తొలకరి అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయి కుంభవృష్టి కురిసింది. వర్షాకాలంలోని తొలివాన నగరాన్ని ముంచెత్తి జనజీవనాన్ని స్తంభింపజేసింది. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. నాలాలు ఉప్పొంగి రోడ్లపై నదుల్లా పారాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. భారీగా ఈదురు గాలులు వీయడంతో పెద్ద చెట్లు కూలి రోడ్డుపై పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అధికారులు కనీస ముందస్తు సమాయత్తం చేయకపోవడం ప్రజలకు శాపంగా మారింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు కనీసం ఎలాంటి సన్నద్ధత చేపట్టకపోవడంతో తొలి వర్షానికే నగరం నీట మునిగింది. మరో రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మున్సిపల్, హైడ్రా, జలమండలి, రెవెన్యూ అధికారులు ముందస్తు సన్నద్ధత ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే తొలి వర్షానికే ప్రజాజీవనం స్తంభించి పోయింది. ఇప్పుడు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో నగర పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఈదురు గాలుల వల్ల భారీ వృక్షాలు నేలకూలాయి. నగర వ్యాప్తంగా 100 చోట్ల చెట్లు కూలినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. విద్యుత్ తీగలు తెగిపడి గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. పలు కాలనీలు రాత్రంతా చీకట్లో మగ్గి పోయాయి. చాంద్రాయణగుట్టలో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఛత్తా బజార్లో ఓ కమాన్ కూలి రోడ్డుపై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్లు చెరువులను తలపించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి, పలు ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ కదిలేందుకే గంట సమయం పట్టింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దిల్సుఖ్నగర్, ముషీరాబాద్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్రోడ్, రామ్నగర్, నాంపల్లి, అబిడ్స్, కోటి, మియాపూర్, కూకట్పల్లి, బేగంపేట, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, ఎర్రగడ్డ, సికింద్రాబాద్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రాజేంద్రనగర్, లంగర్ హౌస్, షేక్పేట, కార్వాన్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్లో ఈదురు గాలులకు విద్యుత్ అంతరాయం కలిగింది. హైదర్గూడలో భారీ చెట్లు నేలకూలాయి. రామ్నగర్ పరిధిలోని వీఎస్టీలో భారీ చెట్లు రోడ్డుపై కూలడంతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నాయిని నర్సింహ రెడ్డి ఫ్లైఓవర్పై భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్యాంక్బండ్పై చెట్లు కూలిపడి, వర్షపునీరు భారీగా చేరింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటానా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించిన మరుసటి రోజే నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి దాకా జోరు వాన కురిసింది. అత్యధికంగా మల్కాజిగి పరిధిలోని వినాయక్నగర్లో 12.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదమైంది. అదే విధంగా బన్సీలాల్పేటలో 8.75 సెంటీమీటర్లు, విఠల్వాడిలో 8, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ 7.85, విద్యానగర్ 7.45, ఎంసీహెచ్ కాలనీ 6.5, బౌద్ధనగర్ 6.2, తాళ్ల బస్తీ 6, చందూలాల్ బారాదరి 5.9, రూప్లాల్ బజార్ 5.8, నెహ్రూనగర్ 5.78, అడిక్మెట్ 5.75, న్యూమెట్టుగూడ 5.75, బేగంబజార్ 5.6, గన్ఫౌండ్రీ 5.5, మియాపూర్ 5.3, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.