హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోతగా వానపడింది. దీంతో ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కూకట్పల్లిలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, కుత్బుల్లాపూర్లో 9.2 సెంటీమీటర్లు, తిరుమలగిరిలో 9 సెం.మీ., రామచంద్రాపురం 8.2 సెం.మీ., మూసాపేట్ 8 సెం.మీ., ఫతేనగర్లో 7.3 సెం.మీ., పటాన్చెరు 7.2 సెం.మీ., బాలానగర్ 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.
ఒకసారిగా భారీ వర్షం కురవడంతో బొరబండలోని కాలనీల్లో వరద పోటెత్తింది. ఇండ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ కింద భారీగా వరద నీరునిలిచిపోయింది. దీంతో రెండు వైపుల పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఖైరతాబాద్, అమీర్పేట్, ఎల్లారెడ్డిగూడ రోడ్డు జంక్షన్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సనత్గర్, ఎస్ఆర్నగర్, వెస్ట్ వెంకటాపురం, రామచంద్రాపురం రోడ్లపై భారీగా ప్రవహించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వచ్చిన నీరు వచ్చినట్లు వెళ్లిపోయేట్లు చర్యలు తీసుకున్నారు.