సీజనల్ను వ్యాధుల నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు
గ్రేటర్ వ్యాప్తంగా ప్రత్యేక వైద్యశిబిరాలు
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపిలేని వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల వైద్య శిబిరాలు, జ్వర సర్వే ప్రారంభించింది. అంతేకాకుండా డెంగీ, టైఫాయిడ్ వంటి కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్యాధికారి, నర్సింగ్ సిబ్బంది, ఏఎన్ఎంలతో ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దింపనున్నది. ప్రస్తుతం గ్రేటర్లో 516 డెంగీ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 104 ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా సాధారణ జలుబు, జ్వరం, దగ్గు వంటి కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలోని 436 ఆరోగ్య కేంద్రాల పరిధిలో జ్వర సర్వే, ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమయ్యారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 259 బస్తీ దవాఖానలు, 177ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు జిల్లా దవాఖానలు, 16ఏరియా హాస్పిటళ్లలో సీజనల్ వ్యాధులకు సంబంధించి చికిత్స, నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వైద్యాధికారులు తెలిపారు. అన్ని బస్తీ దవాఖానల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
మూడు రోజుల్లో తగ్గకపోతే.. పరీక్షలు చేయించుకోవాలి
సీజనల్లో వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న రోగులకు స్థానిక ఆరోగ్య కేంద్రాల్లోనే సీజనల్ పరీక్షలు, కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. సీజనల్, కరోనా బాధితులకు మందులు ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. రోగికి మూడు నుంచి ఐదు రోజుల్లో లక్షణాలు తగ్గకపోతే వెంటనే వారికి లక్షణాల ఆధారంగా డెంగీ, కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ప్రజలు జ్వర లక్షణాలు ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి. సొంత వైద్యం శ్రేయస్కరం కాదు.
– డాక్టర్ వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి