సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కాలేజీలో క్లాస్ నడుస్తున్నది. విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఓ యువకుడు ఏకంగా క్లాస్ రూమ్లోకి చొరబడ్డాడు. విద్యార్థులంతా చూస్తుండగానే నేరుగా ఓ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. నన్ను ప్రేమిస్తావా..? లేదా..? అంటూ ఆ యువతిని బెదిరిస్తూ హీరోయిజాన్ని ప్రదర్శించాడు. ధైర్యంగా నిలబడిన ఆ యువతి.. ఫిర్యాదు చేయడంతో షీ టీమ్స్ యువకుడిని పట్టుకొని కటకటాల్లోకి పంపించాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అక్కడక్కడ జరుగుతున్నాయి. షీ టీమ్స్కు ఫిర్యాదులు అందుతున్నాయి. వెంటనే స్పందిస్తున్న షీ టీమ్స్ రంగంలోకి దిగి నిందితులను పట్టుకుంటున్నాయి.
బాధితులకు భరోసా ఇస్తున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గడిచిన 15 రోజుల వ్యవధిలో 83 మంది ఆకతాయిలను పట్టుకున్నట్లు మహిళా సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్ గురువారం మీడియాకు తెలిపారు. పట్టుబడ్డ ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. మహిళలను వేధించే వారి పట్ల కఠినంగా ఉంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. నిర్భయంగా మహిళలు షీ టీమ్స్ను ఆశ్రయించాలని సూచించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, విద్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో షీ టీమ్స్ తిరుగుతూ..
డేకాయి ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని వివరించారు. మహిళలను వెంబడిస్తూ, వేధించే వారిని సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నామని తెలిపారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను డీసీపీ వివరించారు.
నడి రోడ్డుపై.. బాలికపై దాడి
నేరేడ్మెట్లో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నది. ఇంతలో నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే రిప్లే ఇవ్వవా..? అంటూ బాధితురాలిని రోడ్డుపై పట్టుకొని కొట్టాడు. అదే సమయంలో అక్కడ డెకాయి ఆపరేషన్ నిర్వహిస్తున్న కుషాయిగూడ షీ టీమ్స్ వీడియో తీసి, బాధితురాలి తల్లికి చూపించారు. దీంతో ఆమె తన కూతురిపై జరిగిన దాడిపై నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
ప్రేమించాలంటూ క్లాస్ రూమ్లోకి వెళ్లి..
చౌటుప్పల్ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఒక విద్యార్థిని క్లాస్ రూమ్లో ఉండగా.. నిందితుడు క్లాస్ రూమ్లోకి దూసుకుపోయాడు. తనను ప్రేమించమంటూ వెంటపడుతున్నా పట్టించుకోవడం లేదని, తనను ప్రేమించకపోతే నీ అంతు చూస్తానంటూ.. బెదిరింపులకు దిగాడు. ఆకతాయి బెదిరింపులపై ఆ విద్యార్థిని చౌటుప్పల్ షీ టీమ్స్ను ఆశ్రయించింది. దీంతో షీ టీమ్స్ నిందితుడిని అరెస్ట్ చేసి, చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు.
బాత్రూమ్ ఫొటోలు తీస్తూ..
మేడిపల్లి ఏరియాలో నివాసముండే ఒక మహిళ బాత్రూంలో ఉండగా.. అదే అపార్టుమెంట్కు గతంలో వాచ్మన్గా పనిచేసిన ఓ వ్యక్తి బయట నుంచి వీడియోలు తీశాడు. వీడియోలు తీస్తున్న విషయాన్ని గుర్తించిన బాధితురాలు వెంటనే అప్రమత్తమైంది. స్థానికుల సహాయంతో అతడిని పట్టుకొని షీ టీమ్స్కు అప్పగించింది. పట్టుబడ్డ వ్యక్తి గతంలో అదే అపార్టుమెంట్కు వాచ్మన్గా పనిచేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపింది. దీంతో నిందితుడిపై మేడిపల్లి పోలీస్స్టేషన్ కేసు నమోదు చేశారు.