‘కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని బీఆర్ఎస్ కోరుతున్నా… కేంద్రం నుంచి స్పందన లేదు. కేసీఆర్ మరోసారి గెలిచిన తర్వాత తెలంగాణ సాధించుకున్నట్లుగానే కేంద్రం మెడలు వచ్చి కంటోన్మెంట్ను బల్దియాలో విలీనం చేసేలా ఒత్తిడి చేస్తాం’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్, సనత్నగర్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులు లాస్యనందిత, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు మద్దతుగా ఆయన పలు రోడ్షోలలో ప్రసంగించారు. కంటోన్మెంట్వాసుల కష్టాలను తీర్చే బాధ్యత బీఆర్ఎస్ సర్కారుదేనని మరోసారి భరోసా ఇచ్చారు. ఇప్పటికే కంటోన్మెంట్లో జీహెచ్ఎంసీ తరహాలో ఉచిత మంచినీటి సరఫరా చేస్తున్నామని, రూ. 47 కోట్ల పెండింగ్ బిల్లులను మాఫీ చేశామని చెప్పారు.
అల్వాల్లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించి ప్రజలకు వైద్య సేవలను మెరుగుపరుస్తామని అన్నారు. ఇక షాన్దార్ సనత్నగర్ దమ్మున్న తలసాని శ్రీనివాస్యాదవ్తోనే సాధ్యమన్నారు. పైరవీలు, పంచాయితీలకు పోకుండా ప్రజల కోసం కష్టపడే నాయకుడు తలసాని అని కొనియాడారు. అలాంటి నాయకుడు సనత్నగర్లో ఉండటం ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణకు ఎకానమిక్ ఇంజిన్ అయిన హైదరాబాద్ను కాపాడుకోవాలని, అందుకోసం బీఆర్ఎస్ అభ్యర్థులు లాస్యనందిత, తలసాని శ్రీనివాస్యాదవ్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : తెలంగాణకు ఎకనామిక్ ఇంజిన్ లాంటి హైదరాబాద్ను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ఆ పార్టీ నాయకులు గల్లీలను వదిలి ఢిల్లీ చేరుతారని ఎద్దేవా చేశారు. కారు గుర్తుకు ఓటేసి, నగరాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్నానగర్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల మనిషి, సౌమ్యుడైన సాయన్న కూతురికి కేసీఆర్ అండగా ఉన్నారని తెలిపారు.
విద్యావంతురాలు, సాయన్న వారసురాలిగా లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని బీఆర్ఎస్ కోరుతున్నా… కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ తరహాలో ఉచిత మంచినీటి సరఫరా, రూ. 47 కోట్ల పెండింగ్ బిల్లులను మాఫీ చేశారని చెప్పారు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే అందుకు బదులుగా షామీర్పేట్ సమీపంలో 500 ఎకరాల భూమిని డిఫెన్స్ శాఖకు ఇస్తామన్నారు. అయినా కేంద్రం నుంచి స్పందన లేదని, దున్నపోతు మీద వాన పడినట్లుగా బీజేపీ నేతలు, కేంద్రమంత్రుల తీరు ఉన్నదని మండిపడ్డారు. కనీసం కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న సివిల్ ఏరియాలనైనా అప్పగించాలని కోరినా బీజేపీ పెడచెవిన పెడుతోందన్నారు. అధికార కాంక్షతో కూతురి లాంటి ఆడబిడ్డను అనరాని మాటలతో బీజేపీ నేతలు అవమానిస్తున్నారని , ఆ పార్టీ నేతలకు లాస్య నందిత గెలుపుతో సమాధానం చెప్పాలన్నారు.
సనత్నగర్ను అభివృద్ధి చేసి షాన్దార్గా మారాలంటే దమ్మున్న తలసానితోనే సాధ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని మహంకాళి టెంపుల్ వద్ద జరిగిన రోడ్ షోలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేళ్లుగా నియోజకవర్గాన్ని ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. సనత్నగర్ ప్రజలకు మంచి వైద్యాన్ని అందించేలా వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. 24గంటల కరెంట్ కనిపించలేదంటున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గత పాలనలో వారానికి మూడు రోజులు కరెంట్ వచ్చేదన్నారు. మూడు రోజుల పవర్ హాలీడేతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వస్తే నీళ్ల కోసం కుస్తీలు, బస్తీల్లో కొట్లాటలు వస్తాయన్నారు. నియోజకవర్గంలో కొంత డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందని, మెట్రోను 400 కిలోమీటర్లకు పొడిగించే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉందన్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే రూ. 400లకే సిలిండర్, కొత్త రేషన్ కార్డులను కూడా జనవరిలో మంజూరు చేస్తామన్నారు.
అల్వాల్లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి ఇక్కడి ప్రజలకు వైద్య సేవలను మెరుగుపరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్లోని పికెట్ చౌరస్తాలో జరిగిన రోడ్షోలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కంటోన్మెంట్లో సంక్షేమ పథకాలు, ఉచిత మంచినీటితోపాటు పెండింగ్ బకాయిలను రద్దు చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. తెలంగాణకు సీల్డ్ కవర్ సీఎంలూ వద్దని, ప్రజల పక్షాన నిలిచే కేసీఆర్ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నేతలు దిగుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతిలో తెలంగాణను పెడితే అన్యాయం అవుతుందన్నారు. కంటోన్మెంట్లో పేదల పక్షాన నిలిచే సాయన్న వారసురాలిగా లాస్య నందితను గెలిపించాలని కోరారు.
కామధేనువు లాంటి హైదరాబాద్ను ఇతర పార్టీల చేతిలో పెట్టొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా అమీర్పేట్ సత్యం థియేటర్ వద్ద జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లలో బెంగళూరును దాటి ఐటీ రంగంలో హైదరాబాద్ నిలబడిందని, 2014లో 3.2లక్షల ఐటీ ఉద్యోగుల సంఖ్యను 10లక్షలకు పెంచుకునేలా పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. గతంలో సనత్నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మర్రి చెన్నారెడ్డి స్వయంగా చెప్పుకున్నారని, పదవుల కోసమే తన సీఎం సీటును లాగేశారన్నారని గుర్తు చేశారు. ఇవాళ పదవుల కోసం ప్రాణాలు తీసిన చరిత్ర కాంగ్రెస్కు ఉందన్నారు. బక్క పల్చని కేసీఆర్ను ఢీకొట్టేందుకు షేర్లు, బబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు ఢిల్లీ, ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్లకు మద్దతుగా కేటీఆర్ రోడ్షో నిర్వహించనున్నారు. తొలుత శేరిలింగంపల్లిలో మూడు ప్రాంతాలు తారానగర్ తుల్జాభవానీ దేవాలయం, మియాపూర్ ఇంద్రారెడ్డి అల్విన్ క్రాస్రోడ్స్, అల్విన్కానీ లాస్ట్బస్టాప్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ స్వప్న థియేటర్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్లో ప్రకాశ్గౌడ్కు మద్దతుగా కేటీఆర్ పాల్గొని మాట్లాడుతారు.