ఘట్ కేసర్/పోచారం, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద పోచారం పట్టణంలోని దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తుండగా, మంత్రి హరీశ్రావుకు ఘట్కేసర్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే అధికారమన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని మరిచి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, కాచవానిసింగారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాచవాని సింగారం మాజీ సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి మాజీ మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వెంకట్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే ప్రజల్లో గౌరవంగా ఉన్నామని, ప్రజాదరణ కోల్పోయిన పార్టీల్లో ఇమడలేకనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు.